తెలంగాణాలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల్లో తిరుగుతోంది.అయితే… ఆ ప్రచారంలో ఆ పార్టీకి ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.ప్రజలు ఆ పార్టీ నాయకులను బహిరంగంగానే నిలదీస్తూ.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు… ప్రస్తుతం నెలకొన్న సమస్యలను గురించి వారిని ప్రశ్నల వర్షంలో తడిపేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే… చాలా చోట్ల ప్రచార రథాలను ధ్వంసం చేయడం … ఇలా అనేక అనేక ఇబ్బందులు టీఆర్ఎస్ ఎదుర్కుంటోంది.ఈ వ్యవహారాల్లో టీఆర్ఎస్ నాయకులు కూడా….ప్రజలమీద మాటల యుద్ధం చేస్తూ… వీధికెక్కుతున్నారు.దీంతో… టీఆర్ఎస్ అధిష్టానానికి ఈ వ్యవహారాలు పెద్ద తలపోటుగా మారింది.
అందుకే కేసీఆర్ ఈ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాడు.ఎన్నికల సమయానికి ఈ వ్యవహారాలు కొత్త తలనొప్పిగా మారకుండా… దిశా నిర్దేశం చేస్తున్నాడు.ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఒకవేళ వారు నిలదీసినా కూడా కోపగించుకోవద్దని, ఓపికగా ఉండాలని తమ పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచించారు.తమ పార్టీ అభ్యర్థులు 107 మందితో ఈరోజు భేటీ అయిన ఆయన, వారికి బీ-ఫారమ్స్ ను అందజేశారు.
ఈ సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ ఈ మేరకు సూచించినట్టు సమాచారం.ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత విషయంలో జాగ్రత్తగా వారికి సర్ది చెప్పాలని చెప్పారు.
అందుకే… ఇప్పటివరకు… ప్రభుత్వం చేసిన పనులు, సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పాలని పార్టీ అభ్యర్థులకు సూచించారు.మన దరిదాపుల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు లేవని, దాదాపు వంద స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం.ఈ నెల 15 నుంచి రెండు హెలీకాప్టర్లలో తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని, డిసెంబర్ 2 లేదా 3న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ భేటీలో కేసీఆర్ చెప్పినట్టు సమాచారం.మహాకూటమి టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేదని … ఆ పార్టీ ఇంకా సీట్లు సర్దుకోవడం లోనే కుమ్ములాటలాడుకుంటోందని కేసీఆర్ విమర్శించారు.