తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన వివిధ సమస్యలపై ఢిల్లీ బిజెపి పెద్దలను, కేంద్ర మంత్రులను కలిసి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.
అయితే ఇప్పటి వరకు ఎవరి అపాయింట్మెంట్ కేసీఆర్ కు దొరకకపోవడంతో, కేసీఆర్ వెంట వెళ్ళిన అధికారులు మాత్రమే ఆహార శాఖ అధికారులతో బియ్యం సేకరణ విషయంపై చర్చలు జరిపారు.కానీ కెసిఆర్ కు మాత్రం మంత్రుల అపాయింట్మెంట్ మాత్రం లభించలేదు.
అసలు కేంద్ర మంత్రులు అందుబాటులో ఉండరనే విషయం కేసీఆర్ కు తెలిసినా, ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం, ఎప్పుడు మళ్ళీ తెలంగాణలో అడుగు పెడతారు అనే విషయం క్లారిటీ లేకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అసలు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లింది జాతీయ రాజకీయల్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలపై చర్చించేందుకు అని, కేసీఆర్ పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఢిల్లీకి వెళ్లడం ఆమె సైతం ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు.
కెసిఆర్ కూడా ఢిల్లీలోనే ఉండడం వంటి వ్యవహారాలు జాతీయ రాజకీయాల్లో ఏదో కీలక పరిణామం జరగబోతోందని, దానిపై చర్చించేందుకు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.వాస్తవంగా కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ముందు ఏపీ సీఎం జగన్ తో ఓ వివాహ వేడుకలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అనేక విషయాలపై వారి మధ్య చర్చ జరిగింది.
ఆ చర్చల అనంతరమే ఏపీలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకోవడం, అమరావతి పైన జగన్ ప్రకటన చేయడం వంటి పరిణామాలు జరిగాయి. ఇక పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో కీలకం అయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని దానిలో భాగంగానే ఈ ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్టుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.