ప్రస్తుతం మండు వేసవిలో ఎండలతో వాతావరణం బాగా హీటెక్కుతుంటే తెలంగాణలో గత రెండు రోజులుగా రాజకీయ వాతావరణం బాగా హీటెక్కుతోంది.ఓ వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో సీఎం కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ను టార్గెట్గా చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్మీట్ పెట్టిన కేసీఆర్ ఆయన్ను ఓ రేంజ్లో ఏకి పడేశారు.ఇక తెలంగాణలో అస్తిత్వం కోసం పోరాడుతోన్న టీడీపీ అక్కడ మహానాడు నిర్వహించింది.
ఈ మహానాడుకు పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం హాజరై టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ప్రకటనలు చేశారు.
ఒకే టైంలో మూడు రాజకీయ పార్టీలు అక్కడ సందడి చేస్తున్నా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వర్సెస్ సీఎం కేసీఆర్ మధ్య జరిగిన మాటల యుద్ధమే ఆసక్తికరంగా మారింది.
తెలంగాణకు లక్షకోట్లు ఇచ్చామని లెక్కలు చెప్పుకొచ్చారు.మోడీ అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తోందని, తెలంగాణాలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా చెప్పారు.
అమిత్ షాకు కౌంటర్ ఇచ్చిన కేసీఆర్ అమిత్ షాను భ్రమిత్ షాతో పోల్చారు.ఆయన దళితవాడలో చేసిన భోజనం అక్కడ వండలేదని… ఆ భోజనం పక్కనే ఉన్న ఖమ్మంగూడెం గ్రామంలో మనోహర్రెడ్డి అనే వ్యక్తి వండించి పంపించారని కేసీఆర్ తెలిపారు.
అమిత్ షాలు, గిమిత్ షాలు నల్గొండ చౌరస్తాలో పాములాట పెడితే ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు.ఆయన ఎన్ని అబద్ధాలు ఆడినా తెలంగాణలో తాజా సర్వే ప్రకారం బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఐదు ఎమ్మెల్యేలతో పాటు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచి మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ ఉన్నారు.మరి కేసీఆర్ చెప్పిన లెక్క చూస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవనట్లేనా.! మరి కేసీఆర్ వ్యాఖ్యలు ఇలా ఉంటే మరోవైపు బీజేపీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏకంగా అధికారంలోకి వస్తామని చెపుతోంది.ఎవరి లెక్కలు ఎలా ఉంటాయో వెయిట్ అండ్ సీ.!
.