కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో మొదట్లో కాస్త ఎక్కువగా కనిపించినా, ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు అనిపించింది.దీంతో నిబంధనల్లో సడలింపు ఇచ్చారు.
అయితే కొద్ది రోజులు తెలంగాణ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు మే 17 వరకు విధించగా, కేసీఆర్ మాత్రం తెలంగాణలో మే 29వ తేదీ వరకు పొడిగించారు.తెలంగాణాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం, లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు మొదలైన విషయాలపై అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించబోతున్నారు.
గత మీడియా సమావేశంలోనే మే 15వ తేదీన సమీక్ష నిర్వహించి మరోసారి కరోనా పాజిటివ్ కేసుల విషయంలోనూ, లాక్ డౌన్ నిబంధనల సడలింపులు విషయంలోనూ నిర్ణయం తీసుకోబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
ప్రస్తుతం తెలంగాణలో నమోదవుతున్న కేసులు మొత్తం ముంబై నుంచి వచ్చిన వారి ఈ కారణంగానే నమోదు అవుతుండడం, ఇప్పటి వరకు గ్రీన్ జోన్ లో ఉన్న యాదాద్రి జిల్లాలో సైతం నాలుగు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటి వరకు తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే రెడ్ జోన్ లో ఉన్నాయి.మిగిలిన అన్ని జిల్లాలు ఆరెంజ్, గ్రీన్ జోన్ లో ఉండేవి.
దీంతో ఆ జిల్లాలో నిబంధనలు కాస్త సడలింపు ఇవ్వాలని కేసీఆర్ చూశారు.కానీ ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఏపీ తో పోలిస్తే తెలంగాణలో కరోనా టెస్ట్ లు చేయడంలో నిర్లక్ష్యంగా ఉందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలోనూ వైరస్ పరీక్షలు ఎక్కువగా చేయాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు.
అలాగే మద్యం షాపులు తెరవడం వల్ల వస్తున్న విమర్శల విషయాన్ని కూడా నేడు నిర్వహించబోయే సమీక్ష సమావేశంలో ప్రస్తావించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేసీఆర్ అడుగులు వేయాలని చూస్తున్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పైన, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే విషయం పైన సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు.దీంతో కేసీఆర్ నిర్ణయాలు ఏవిధంగా ఉండబోతున్నాయనే విషయాలపై అందరికీ టెన్షన్ మొదలైంది.