హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎవరికి వారు తామే గెలుస్తామనే ధీమా లో ఉన్నట్టుగానే కనిపిస్తున్నా , అందరిలోనూ గెలుపు పై భయం నెలకొంది.అన్ని పార్టీలకు గెలవడం ప్రతిష్టాత్మకం కావడంతో, పూర్తిగా దృష్టి అంతా ఇక్కడే పెట్టారు.
మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గెలుపునకు అవసరమైన అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.ఇక్కడి నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కు బలమైన సామాజికవర్గం అండదండలు ఉండడంతో పాటు, దశాబ్దాలుగా ఇక్కడి నుంచి రాజేందర్ గెలుస్తూ వస్తుండడంతో, ఆయన ఓటమి అంత తేలికైన విషయం కాదు అనే విషయాన్ని టిఆర్ఎస్ గుర్తించింది.
అందుకే మంత్రులను, ఎమ్మెల్యేలను మండలాల వారీగా ఇన్చార్జిలుగా నియమించింది.అక్కడితో ఆగకుండా ఇంటెలిజెన్స్ అధికారులను రంగంలోకి దింపింది.
దాదాపు 200 మంది ఇంటెలిజెన్స్ అధికారులు నియోజకవర్గంలో పాగా వేసి మరి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నారు.ఇక్కడ ఎవరికి గెలుపు దక్కుతుందా అనే విషయాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు.
హుజూరాబాద్ నియోజకవర్గం కు సంబంధించి ఏ విధంగా సర్వే నిర్వహించాలి ? ఏ అంశాల పై ప్రజల నుంచి సమాధానం రాబట్టాలి అనే విషయంపై 200 మంది ఇంటెలిజెన్స్ అధికారులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం.ఇవే కాకుండా టిఆర్ఎస్ అనేక ప్రైవేటు సంస్థలను రంగంలోకి దించి వాస్తవ పరిస్థితులను, గెలిచేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషించే పనిలో పడింది.
ఇంటిలిజెన్స్ రిపోర్ట్ లతోపాటు , ప్రైవేట్ సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికలు ఎప్పటికప్పుడు కేసీఆర్ కు చేరిపోతున్నాయి.వాటికి అనుగుణంగా రాజకీయ ఎత్తులు పైఎత్తులు వేస్తూ హుజరాబాద్ లో గెలిచేందుకు టిఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఒకవైపు ఈటెల రాజేందర్ మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వంటి రాజకీయ ఉద్దండులను ఎదుర్కొని టిఆర్ఎస్ ముందుకు వెళ్లడం ఆషామాషీ వ్యవహారం కాదని ఆ పార్టీ గుర్తించింది.అందుకే ఇంత భారీగా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది.