చాలాకాలంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.అదిగో ఇదిగో అంటూ హడావుడి చేయడం తప్ప కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించడమే లేదంటూ చాలా మంది ఆశావాహులు నిట్టూర్చారు కూడా.
అయితే ఇప్పుడు మాత్రం మంత్రివర్గ విస్తరణపై సీరియస్ గానే గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది.అసలు దసరాకి ముందే ఈ మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ మంత్రి వర్గ విస్తరణలో కేసీఆర్ కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బెర్త్ ఖాయం అవ్వగా కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు సంగతి సందిగ్ధంలో ఉందట.హరీష్ కు మంత్రిపదవి దక్కకపోవచ్చనే విషయాన్ని కేసీఆర్ సన్నిహితులు ద్రువీకరిస్తున్నారు.
ఒకవేళ ఆయనకు అవకాశం దక్కినా తగిన ప్రాధాన్యం లేని శాఖ దక్కుతుందని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం కేసీఆర్ విస్తరించబోతున్న క్యాబినెట్లో పార్టీలు మారి వచ్చినవారితో పాటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారికి కూడా అవకాశం దక్కబోతున్నటు తెలుస్తోంది.
అసలు ఈ క్యాబినెట్ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కబోతోంది అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే తాజాగా ఎమ్యెల్సీ గా ప్రమాణస్వీకారం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడ కేబినెట్ లో చోటు ఖాయం అయినట్టు సమాచారం.అలాగే టీడీపీకి గుడ్బై చెప్పిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కూడ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం కేసీఆర్తో పాటు 12 మంది మంత్రులు ఉన్నారు.మరో ఆరుగురికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది.రెండు విడతలుగా మంత్రివర్గ విస్తరణ చేస్తారా లేక ఒకేసారి ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా అనేది తెలియాల్సి ఉంది.సెప్టెంబర్ 4 లేదా 12 తేదీల్లో ఏదో ఒక రోజున కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం ఊపందుకుంది.
మరీ ముఖ్యంగా చెప్పుకుంటే ఈ మంత్రి వర్గ విస్తరణలో కేటీఆర్ కు చోటు ఖాయం అయ్యిందట.ప్రస్తుతం ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో కొన్నిసమావేశాల్లో పాల్గొనేందుకు ప్రోటోకాల్ సమస్యలు వస్తుండడంతో ఆయనకు మంత్రిగా అత్యవసరంగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఏర్పడిందట.కేటీఆర్ కు అవకాశం కల్పించి ఆ తరువాత చేపట్టబోయే విస్తరణలో హరీష్ కు చోటు కల్పిస్తారా అనేది కూడ స్పష్టత లేదు.ఇక ఈ విస్తరణలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు చోటు కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది.
నిజామాబాద్ జిల్లా నుంచి బాజిరెడ్డి గోవర్థన్ పేరు కూడ పరిశీలనలో ఉంది.గిరిజన కోటాలో సత్యవతి రాథోడ్, రేగా కాంతారావుల పేర్లు కూడ పరిశీలనలో ఉన్నాయి.
అలాగే ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్, అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్ ల పేర్లు కమ్మ సామాజిక వర్గం కోటా నుంచి వినిపిస్తున్నాయి.తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలు కావడంతో ఆయనను మంత్రివర్గంలో తీసుకొంటారా లేదా అనేది స్పష్టత లేదు.
ఇక టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సత్తుపల్లి ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది.ఇక ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పిస్తే బీసీ కోటాలో దానం నాగేందర్, వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ లలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
.