చాలా కాలంగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ గురించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలంగా ఊరిస్తూనే ఉన్నారు.కానీ అది కార్యరూపం దాల్చడానికి ఏవేవో అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి.
రెండో సారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా రోజుల వరకు ఒకే ఒక్క మంత్రితో కేసీఆర్ నెట్టుకొచ్చారు.ఆ తరువాత మంత్రి మండలి ఏర్పాటు చేసినా కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం కల్పించారు.
సీయంతో పాటు 17 మందికి మంత్రి మండలిలో తీసుకునే అవకాశం ఉంది.కానీ, కేవలం 11తోనే కేసీఆర్ సరిపెట్టేసారు.
ఇక అప్పటి నుంచి రెండోసారి మంత్రి వర్గ విస్తరణపై కేసీఆర్ ఊరిస్తూనే ఉన్నాడు.పార్లమెంట్, జిల్లా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికలు వరుస వరుసగా రావడంతో విస్తరణ జోలికి వెళ్లలేదు.
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి.ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టినట్టు పార్టీ లో హడావుడి మొదలయ్యింది.
మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ ఇంతగా ఆసక్తి చూపించడం వెనుక కారణం కూడా ఉందట.ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊపు తీసుకురావాలంటే తన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు ను మంత్రి వర్గంలోకి తీసుకోవాల్సిందే అని కేసీఆర్ భావిస్తున్నాడట.
అదీ కాకుండా కేటీఆర్ కి, హరీష్ రావు కి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో చాలా కాలంగా వినిపిస్తోంది.ముఖ్యంగా కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ సన్నిహితులు చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
ఆయన మంత్రి అయితేనే మరింతగా సేవ చేయగలరు అంటూ హోం మంత్రి మహమూద్ అలీ ఓ మీటింగ్ లో మాట్లాడారు.గతవారం కూకట్ పల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాధవరం కృష్ణరావు మాట్లాడుతూ కేటీఆర్ మంత్రిగా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందిగా ,బాధగా ఉందనీ, ఆయనకి కేబినెట్ లో చోటు కల్పిస్తే బాగుంటుందని ప్రసంగించారు.
ఇలా ఎవరికి వారు తమ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ కేటీఆర్ కు మంత్రి పదవి అత్యవసరంగా ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నారు.
కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారు.కానీ ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండడంతో పార్టీ కార్యక్రమాలకే పరిమితం అయిపోతున్నారు.గ్రేటర్ పరిధిలో ఈ మధ్య తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఆ పార్టీకి చెందినవారే సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో హైదరాబాద్ పరిధిలోనే బాగా వెనకబడింది.ఇదే అదునుగా బీజేపీ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తుండడంతో కేసీఆర్ ఆలోచనలో పడ్డాడట.ప్రోటోకాల్ లేకపోవడం వల్లే అధికారిక కార్యక్రమాలకు కేటీఆర్ దూరంగా ఉండాల్సి వస్తుందని భావిస్తున్న కేసీఆర్ ఇక ఆలస్యం చేయకుండా కేటీఆర్ కి మంత్రి పదవి ఇచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలని చూస్తున్నాడట.