హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.ఈ రోజు ఉదయం నుంచి ఆయన వేరే పార్టీ వ్యక్తులతో మాట్లాడుతూ బేరసారాలు సాగించినట్లు ఉన్న ఆడియో ఒకటి వైరల్ గా మారింది.
దీని ప్రభావం వల్లే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
అసలు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని ఎప్పటి నుంచో కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తుండడం గమనార్హం.
వారి ఆరోపణలకు బలం చేకూరుస్తూఈ రోజు కౌశిక్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ స్థానం కోసం జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆయన కారు పార్టీ తరఫున బరిలోకి దిగుతారని తెలుస్తోంది.
ఇందుకు ఇప్పిటికే కౌశిక్ రెడ్డి గులాబీ పెద్దలతో మంతనాలు పూర్తి చేశాడని తెలుస్తోంది.కాగా కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఈ వ్యాఖ్యలకు మరింతగా బలం చేకూరింది.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడం పక్కా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
కొన్ని రోజుల క్రితమే కౌశిక్ రెడ్డి ఒక కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ను కలవడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది.కానీ తాను కేటీఆర్ తో ఎటువంటి రాజకీయాలు చర్చించలేదని కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి బంధువు కావడం గమనార్హం.
ఎప్పటి నుంచో హుజురాబాద్ నియోజకవర్గ స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా పాడి కౌశిక్ రెడ్డి కండువా మార్చుతాడని చర్చించుకుంటున్నారు.కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి దారెటనేది ఇంకా తెలియాల్సి ఉంది.