తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది.ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో కీలక నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు కొద్దిరోజులుగా వస్తూనే ఉన్నాయి.
కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న ఆయన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడంతో తనకు టిక్కెట్ దక్కదు అనే అభిప్రాయం లో ఉన్నారని , అందుకే టిఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ తరపు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది.అయితే ఇందులో ఎంత వాస్తవం ఉన్నది అనేది స్పష్టంగా తెలిసినప్పటికీ, ఆయన పార్టీ మారుతున్నారనే వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే హుజురాబాద్ టిఆర్ఎస్ టికెట్ తనకే అంటూ కౌశిక్ రెడ్డి పేరుతో తో ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నాకే హుజూరాబాద్ టిఆర్ఎస్ టికెట్, డబ్బు దస్కం అంత నే చూసుకుంటా అంటూ కౌశిక్ రెడ్డి పేరుతో ఆడియో బయటకు వచ్చింది.
అయితే ఇది కౌశిక్ రెడ్డి వాయిస్ అవునా కాదా అనే విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ, ఈ ఆడియో వైరల్ గా మారడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారింది.ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది.
ఈ మేరకు టిపిసిసి క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీ కోదండ రెడ్డి చర్యలకు దిగారు.ఈ వ్యవహారంపై సరైన వివరణ ఇవ్వాలంటూ ఆయన కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
చాలా కాలంగా కౌశిక్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనేక ఫిర్యాదులు క్రమశిక్షణ సంఘానికి గతంలోనే రావడం తో క్రమశిక్షణ సంఘం ఆయనను పిలిచి వార్నింగ్ ఇచ్చింది.
అయినా ఆయన తీరు మారక పోవడంతో నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.ఇదే కాకుండా కొత్తగా పిసిసి బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో సీరియస్ గా ఉండడంతోనే ఈ నోటీసు వెళ్లినట్లుగా తెలుస్తోంది.దీనిపై కౌశిక్ రెడ్డి ఏ విధంగా వివరణ ఇస్తారో చూడాలి.
గతంలోనే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో భేటీ కావడం పైన దుమారం రేగింది.ఇప్పుడు ఈ ఆడియో తో ఆయన వ్యవహారం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.