దేశంలోని ఉత్తరాఖండ్లోని కుమౌన్ ప్రాంతంలోని అల్మోరా జిల్లాలో కసర్ దేవి ఆలయం ఉంది.ఇది అయస్కాంత లక్షణాల కారణంగా ప్రపంచంలోనే ప్రత్యేక ప్రదేశంగా గుర్తింపు పొందింది.
ఈ కసర్ దేవి ఆలయం ఘన చరిత్రను కలిగి ఉంది.స్వామి వివేకానందతో పాటు గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, టిబెటన్ బౌద్ధ గురువు లామా అంగారిక గోవింద, పాశ్చాత్య బౌద్ధ గురువు రాబర్ట్ థుర్మాన్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు.
డిఎస్ లారెన్స్, క్యాట్ స్టీవెన్స్, బాబ్ డైలాన్, జార్జ్ హారిస్, డెన్మార్క్కు చెందిన ఆల్ఫ్రెడ్ సోరెన్సన్ వంటి అనేక మంది పాశ్చాత్య ప్రముఖులు ఆలయాన్ని సందర్శించారు.ఈ ఆలయం సముద్ర మట్టానికి 2116 మీటర్ల ఎత్తులో అల్మోరా బాఘేశ్వర్ హైవేకు సమీపంలోని ఒక గ్రామంలో నిర్మితమయ్యింది.
ఈ గ్రామాన్ని కాసర్ దేవి అని కూడా పిలుస్తారు.దుర్గామాత అవతారంగా పేర్కొనే కసర్ దేవి ప్రత్యేక ప్రభావం ఇక్కడ ఉందని స్థానికులు చెబుతుంటారు.ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1890లో స్వామి వివేకానంద ఇక్కడ కొండపై ఉన్న ఏకాంత గుహలో తీవ్రమైన ధ్యాన సాధన చేశారు.సాధారణ రాళ్లతో తీర్చిదిద్దిన ఈ ఆలయం రెండవ శతాబ్దంలో నిర్మించారని చెబుతారు.
ఆలయం చుట్టూ పైన్, దేవదారు వృక్షాలు ఉన్నాయి.ఈ ఆలయాన్ని ఒక కొండను తవ్వి నిర్మించారు.
అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఆలయాన్ని బిర్లా కుటుంబం 1948లో నిర్మించింది.
అమ్మవారి ఆలయం మాత్రమే కాకుండా 1950లలో నిర్మించిన శివాలయం కూడా ఇక్కడ కనిపిస్తుంది.నాసా పరిశీలనలు, అధ్యయనాలు సైతం కసర్ దేవి భూ అయస్కాంత క్షేత్రం చాలా ప్రత్యేకమైనదని నిర్ధారించాయి.ఈ భూ అయస్కాంత క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది సౌర గాలులను అడ్డుకుంటుంది.
శక్తివంతమైన కణాలను వెదజల్లుతుంది.వాతావరణాన్ని విధ్వంసం నుండి కాపాడుతుంది.
ఇక్కడి భూ అయస్కాంత ప్రభావం వల్ల మనిషికి ఎంతో ప్రశాంతత లభిస్తుంది.ఇక్కడ ధ్యానం చేయడం ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది.