తెలంగాణలో టిడిపి అధినేత చంద్రబాబు ఆదివారం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ వాళ్లు బియ్యంతో అన్నం వండుకుని తింటున్నారంటే.
ఆ ఘనత తెలుగుదేశం పార్టీ దేనని, టిడిపి రాకముందు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు తినేవారని , టిడిపి వచ్చాక బియ్యంతో అన్నం వండుకుని తింటున్నారని, అలాగే తెలంగాణకు సంపద వస్తుందంటే టిడిపినే దానికి కారణం అని , అప్పుడు చేసిన అభివృద్ధి వల్ల ఈరోజు తెలంగాణకు ఫలాలు అందుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమరమే రేగింది.
తెలంగాణ ప్రజలను చంద్రబాబు అవమానించారని , ప్రజా సంఘాలతో పాటు, వివిధ పార్టీలు దీనిపై స్పందించాయి.
ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో నష్ట నివారణ చర్యలకు టిడిపి దిగింది.ఈ మేరకు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు.” నాడు ఆకలి రాజ్యమేలుంది.తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జొన్నగట్క, సజ్జలు ఒట్టు ఒడ్లు నల్ల వడ్లు, మొక్కజొన్న గట్కా తిని పేదలు బతికేవారు.మా ఊళ్లో మేము గట్కా తిని గెంజి తాగేవాళ్ళం.
ఎన్టీఆర్ తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం వల్లే ఆకలి రాజ్యం పోయింది” అంటూ తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసిన విమర్శలు నేపథ్యంలోనే కాసాని జ్ఞానేశ్వర్ ఈ విధంగా కవర్ చేసే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపడుతూ తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం పైన జ్ఞానేశ్వర్ స్పందించారు.
చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తూ నిరంజన్ రెడ్డి దొరలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మానేయాలని జ్ఞానేశ్వర్ విమర్శించారు.15 రోజులలోనే ఒట్టు వడ్ల పంట వచ్చేదని , ఆ పదిహేను రోజులలోనే కొన్ని వేల మంది ప్రజలు తిండికి అలమటించేవారని, అటువంటి గడ్డి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పేదలకు కడుపునిండా తినే అవకాశం రెండు రూపాయలకే కిలో బియ్యం ద్వారా ఇచ్చారని జ్ఞానేశ్వర్ అన్నారు.కారంతో ముద్ద తిని ఆకలి తీర్చుకున్న ఆ రోజుల్లో బిర్యాని ఎక్కడ దొరికిందో నిరంజన్ రెడ్డి చెప్పాలని, హైదరాబాద్ పాతబస్తీ హోటళ్ళలో దొరికిన దమ్ బిర్యాని మహబూబ్ నగర్ లో దొరికిందా అంటూ ప్రశ్నించారు.
దొరలకు కూడా ఆనాడు సన్న బియ్యం దొరికేది కాదని, రాజహంస అనే బియ్యం అక్కడక్కడ లభించేవని, పచ్చ జొన్నలు తినడం కరెక్టా కాదా అంటూ జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు.ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారా లేదా ? ఆహార భద్రత టిడిపి వచ్చాకే వచ్చిందనడం వాస్తవమా కాదా అంటూ జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు.