‘ఇల్లు అలకగానే పండుగ కాదు’ అంటున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి.అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలితను కర్నాటక హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడంపై స్పందించిన ఆయన ‘ఇది తుది తీర్పు కాదు’ అని వ్యాఖ్యానించారు.అంటే…ఈ తీర్పుకే జయలలిత సంబరపడనక్కర్లేదని, సుప్రీం కోర్టు కూడా ఉందని ఆయన ఉద్దేశం కావొచ్చు.ఈ సందర్భంగా ఆయన గాంధీజీ చెప్పిన మాటలను ఉదహరిస్తూ అన్ని కోర్టులకు మించిన మరో కోర్టు ఉందని అదే తుది తీర్పు ఇస్తుందని వ్యాఖ్యానించారు.
అంటే ఎన్నికల్లో ప్రజల తీర్పు అనే అర్థంలో మాట్లాడినట్లుగా ఉంది.కింది కోర్టులో పద్దెనిమిదేళ్లు జరిగిన విచారణ హైకోర్టులో కేవలం మూడు నెలలు మాత్రమే జరిగి జయలలితకు అనుకూలంగా తీర్పు వచ్చిందని కరుణానిధి కుమారుడు స్టాలిన్ అన్నారు.
ఈ తీర్పు అసాధారణంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు.తమిళనాడు ప్రజలు ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఓడగొడతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ తీర్పుపై డీఎంకే సుప్రీం కోర్టుకు వెళుతుందో లేదో స్పష్టం కాలేదు.సుప్రీం కోర్టుకు వెళ్లాలని సీపీఎం వ్యాఖ్యానించింది.
మొత్తం మీద జయలలితకు అనుకూలంగా తీర్పు రావడంపై చాలామంది న్యాయనిపుణులు విస్మయం చెందుతున్నారు.జయలలిత ఆడంబర జీవితం గురించి తెలిసినవారంతా ఆమె అవినీతికి పాల్పడలేదంటే నమ్మలేకుండా ఉన్నారు.
సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో ఎన్నికల్లోగాని తేలదు.