పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదని, ప్రజలు ఆ పుత్రుడి ప్రతిభను గుర్తించి ప్రశంసించినప్పుడు నిజమైన పుత్రోత్సాహం కలుగుతుందని ఓ కవి చెప్పిన పద్యం చాలామందికి తెలుసు.కొందరు కుమారులు తండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తారు.
కొందరు తలవంపులు తెస్తారు.అవమానాల పాలుచేస్తారు.
కర్నాటక లోకాయుక్త కుమారుడు ఈ రెండో పని చేసి తండ్రికి తలవంపులు తెచ్చాడు.లోకాయుక్త జస్టిస్ భాస్కర్రావు కుమారుడు అశ్విన్కుమార్ అవినీతి కేసులో సోమవారం అరెస్టు కావడంతో లోకాయుక్త తలవంచుకునే పరిస్థితి ఏర్పడింది.
అశ్విన్ కుమార్ ఒక ఇంజనీర్ను కోటి రూపాయల లంచం డిమాండ్ చేశారు.తనకు కోటి రూపాయలు ఇవ్వకపోతే అవినీతి కేసు పెడతానని బెదిరించాడు.
దీంతో ఆ ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పరారీలో ఉన్న అశ్విన్ కుమార్ను పట్టుకునేందుకు లోకాయుక్త అభ్యర్ధన మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది.
చివరకు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు.కుమారుడు అరెస్టు కాగానే తనకు లోకాయుక్తగా విధులు నిర్వహించే నైతిక బాధ్యత లేదని భావించిన జస్టిస్ భాస్కర్రావు రాజీనామాకు సిద్ధపడ్డారు.
నిజానికి లోకాయుక్త తప్పు చేయలేదు.కాని కుమారుడి కారణంగా విమర్శలపాలు కావల్సివస్తోంది.‘నీ కొడుకును నీతిమంతుడిగా తీర్చిదిద్దలేనివాడివి అవినీతి కేసులు విచారించే హక్కు నీకు ఎక్కడుంది? అని విమర్శించేవారుంటారు.దీంతో నైతిక బాధ్యతగా పదవి నుంచి తొలగిపోవాలని నిర్ణయించుకున్నారు.
తండ్రి నిర్వహిస్తున్న పదవిని చూసైనా కుమారుడు ఇలాంటి నీతిమాలిన పని చేయకుండా ఉండాల్సింది.