కర్ణాటక లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది.ఇప్పటికే జేడీఎస్-కాంగ్రెస్ ల మధ్య చెడింది అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్న ఈ సమయంలో గాలి బ్రదర్స్ అనుచరుడిగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.
ఆయన రాజీనామా కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది.ఆనంద్ సింగ్ గతంలో అక్రమ మైనింగ్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లారు.
అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు.అప్పట్లో ఆయన్ను కాంగ్రెస్ గూటికి తీసుకురావడంలో ఆ పార్టీ నేత, మంత్రి డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారని చెప్పాలి.
అయితే సీఎం కుమారస్వామి అమెరికాలో ఉండగా ఆనంద్ సింగ్ రాజీనామా వంటి పరిణామాలు చోటుచేసుకోవడం అధికారపార్టీని కలవరపెడుతున్నాయి.ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఇప్పటికే స్పీకర్ కు తన రాజీనామా పత్రం సమర్పించారు.
అటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడుస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.ఇదంతా బీజేపీ ఆకర్ష్ లో భాగంగానే ఆనంద్ సింగ్ రాజీనామా చేసారా లేదా మరేదైనా కారణం ఉందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది.