అశ్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి ఆప్ఘనిస్తాన్ను తాలిబన్లు తమ వశం చేసుకున్న సంగతి అందరికీ విదితమే.ఈ నేపథ్యంలోనే ఆ దేశం నుంచి జనం విదేశాలకు పారిపోయారు.
ఇక మహిళలు అయితే తమకు దేశంలో రక్షణ కరువైందని భయాందోళన చెందుతున్నారు.మొత్తంగా క్రూరమైన, అరాచక పాలన ఆప్ఘన్లో జరుగుతోంది.
ఇటీవల పలు రాజకీయ పార్టీల నేతలు సైతం ప్రత్యర్థి పార్టీల నేతలను తాలిబన్లతో పోలుస్తున్నారు.ఈ క్రమంలోనే ఓ బీజేపీ ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు చేశాడు.
మన దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు తాలిబాన్లే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసి, విమర్శల పాలవుతున్నాడు.అతనెవరంటే.
కర్నాటక రాష్ట్రానికి చెందిన హుబ్లీ-ధార్వాడ్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బల్లాడ్.ఆప్ఘనిస్తాన్లో తాలిబన్ల సంక్షోభం ముదురుతుందని, అందువల్ల ముడి చమురు సరఫరా తగ్గిపోయిందని పేర్కొంటూ అందువల్లే దేశంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు.
ఓటర్లుకు ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి అస్సలు అర్థం చేసుకునేంత నాలెడ్జ్ లేదంటూ ఎమ్మెల్యే బల్లాడ్ వివరించారు.ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా కొంతమంది ఊరికే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కాగా, ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.సోషల్ మీడియా వేదికగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ల కోసమే బీజేపీ పని చేస్తుందని, అందుకే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటూ పేర్కొంటున్నారు.ఈ క్రమంలోనే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో సామాన్యుడి నడ్డీ విరుగుతున్నదని, ప్రభుత్వాలు ఈ విషయమై ఆలోచించాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
విపక్ష పార్టీలు సైతం కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి.ప్రజలు ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్తారని విపక్ష పార్టీలు చెప్తున్నాయి.