ఏపీలో కాపు ఉద్యమం మరోసారి కాక పుట్టించేలా కనిపిస్తోంది .గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపులను బీసీల్లో చేర్చుతాము అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడంతో, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ డిమాండ్ ను నెరవేర్చాలని కాపు నాయకులు అంతా చంద్రబాబుపై ఒత్తిడి చేసినా పట్టించుకోకపోవడంతో ఏపీలో కాపు ఉద్యమం బయలుదేరింది.
ఎన్నికల హామీని నెరవేర్చాలని కోరుతూ కాపు సామాజిక వర్గం అంతా రోడ్లెక్కి నిరసనలు చేస్తూ హడావుడి చేశారు.ఈ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో పోలీసులతో ఆ ఉద్యమాన్ని అణచివసేందుకు ప్రయత్నించడం వంటి పరిణామాలతో కాపు ఉద్యమం ఏపీ లో కాక రేపింది.
అలాగే ఐదేళ్ల పాటు ఈ ఉద్యమ హడావుడి నడిచింది.
ఇక 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత జగన్ కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ పై తాము అటువంటి హామీ ఇవ్వాలేను అని కేంద్రం కనుక కాపులను బీసీల్లో చేర్చుతాను అంటే తనకు అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చేశారు.
ఆ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముద్రగడ పద్మనాభం కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ కు మద్దతు ఇవ్వాలంటూ జగన్ కు లేఖ రాయడం, ఆ తర్వాత పరిణామాలు ముద్రగడ కాపు ద్రోహి అంటూ సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరగడం, ఆ ప్రచారంతో మనస్తాపం చెందిన ముద్రగడ పూర్తిగా ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇక అప్పటి నుంచి కాపు ఉద్యమానికి సారథ్యం వహించే నాయకుల కోసం 13 జిల్లాల జేఏసీ నాయకులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, కాపు నాయకుడు చేగొండి హరిరామజోగయ్య కాపు ఉద్యమానికి సారథ్యం వహించేందుకు సిద్ధమైనా, ఆయనకు వయస్సు పైబడటం, యాక్టివ్ గా ఉండే అవకాశం లేకపోవడం, కాపు నాయకుల్లోనే చాలా మందికి ఆయన నాయకత్వ లక్షణాలపై అనుమానం ఉండటం వంటి కారణాలతో, మళ్లీ ముద్రగడ కాపు ఉద్యమానికి సారథ్యం వహించాలని పదే పదే ఆయనపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు కలిసి ఉద్యమం కు సారథ్యం వహించే విషయమై ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నించినా, ఆయన ఇష్టపడలేదు అని ప్రకటించినా, ఆయన జేఏసీ నాయకులు వదిలిపెట్టకుండా, ఆయనపై ఇప్పటికీ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.ఆయన అయితే తాము అనుకున్న లక్ష్యం నెరవేరుతుందనే అభిప్రాయంతో కాపు జేఏసీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.