ఎన్నారై మహిళను వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి వేధించిన ఆస్ట్రేలియాలో స్థిరపడిన కన్నడ చిత్ర నిర్మాతను బెంగళూరులోని నందినీ లేఔట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మెల్బోర్న్లో స్థిరపడిన రూపేశ్ కన్నడ చిత్రాలతో పాటు కొన్ని దక్షిణ భారతదేశ సినిమాలను ఆస్ట్రేలియాలో విడుదల చేస్తున్నాడు.
అదే సమయంలో అక్కడే భర్త, పిల్లలతో నివసిస్తున్న భారతీయ మహిళతో రూపేశ్కు పరిచయం ఏర్పడింది.
వీరిద్దరూ ఫోన్ నెంబర్లను ఇచ్చిపుచ్చుకుని తరచుగా మాట్లాడుకునేవారు.
కొద్దిరోజుల తర్వాత రూపేశ్ ఆమెను ఒక రెస్టారెంట్లో కలుసుకున్నాడు.అక్కడ కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి అనంతరం ఆమెను వీడియోలు తీశాడు.
ఇక అప్పటి నుంచి వాటి సాయంతో రూపేశ్ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు.తన కోరిక తీర్చాలని, లేకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని వేధింపులకు గురిచేశాడు.
పరువు పోతుందని భావించిన ఆమె అతనికి రూ.6 లక్షలు ఇచ్చింది.అయినప్పటికీ రూపేశ్ వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నాడు.అతని బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితురాలు భారతదేశానికి తిరిగివచ్చి బెంగళూరులో అత్తగారితో కలిసి నివసిస్తోంది.అయినప్పటికీ ఆమెను వదలని రూపేశ్ మెల్బోర్న్ నుంచి ఫిబ్రవరి 22న బెంగళూరుకు చేరుకుని, మళ్లీ వేధింపులకు దిగాడు.చివరికి ఆమెలో సహనం నశించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూపేశ్ను శుక్రవారం యశ్వంత్ పూర్లోని జెపీ పార్క్ సమీపంలోని ఓ హోటల్లో అదుపులోకి తీసుకుంది.అతనిపై దోపిడి, తదితర కేసులు నమోదు చేసినట్లు నార్త్ డివిజన్ డీసీపీ శశికుమార్ తెలిపారు.