ఏపీలో త్రిముఖ వ్యూహం అమలు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది.వచ్చే ఎన్నికల్లో టీడీపీని టార్గెట్ చేస్తూ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది.
ఏమిటా త్రిముఖ వ్యూహం అంటే.ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టడం, ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడం.
ఇందులో భాగంగానే మొన్న విజయవాడలో బీజేపీ నేతలు మహాధర్నా నిర్వహించినట్లు తెలుస్తోంది.అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ తనదైన ముద్రవేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పలువురు టీడీపీ నేతలు ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గవర్నర్ నరసింహన్కు కూడా ఫిర్యాదు చేశారు.ఆ తర్వాత టీడీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా మహాధర్నా చేపట్టారు.అయితే.కన్నా కార్యాచరణలోనూ కన్నాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరగడం గమనార్హం.ఇదంత కూడా పార్టీ ప్రయోజనాలకు కాకుండా.మోడీ వద్ద మార్కులు కొట్టేయడానికే కన్నా ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఢిల్లీకి వెళ్లి మర్యాదపూర్వకంగా ప్రధాని మోడీని, ఇతర నేతలను కలిసేముందు.కన్నా ఇలాంటి ట్రిక్స్ ఉపయోగించినట్లు పలువురు నాయకులు చెబుతున్నారు.
అందరూ అనుకున్నట్లుగానే.ఈ రెండు కార్యక్రమాల తర్వాత నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీని కన్నా మర్యాదపూర్వకంగా కలవడం గమనార్హం.అయితే ఏపీలో బీజేపీ త్రిముఖ వ్యూహం అమలుపై ఇట్స్ టూ లేట్.అనే టాక్ వినిపిస్తోంది.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నచందంగా కార్యాచరణ ఉందని ఆ పార్టీ వర్గాల్లోనే అంతర్గతంగా చర్చమొదలైనట్లు సమాచారం.నిజానికి కేంద్రం నుంచి, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రాగానే అమలు చేయాల్సిన వ్యూహాన్ని జరగాల్సిన నష్టం జరిగాక చేయడమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఏప్రిల్ 6న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన రెండు నెలల తర్వాత ఏపీలో పార్టీ కార్యాచరణ మొదలుపెట్టడంపై పలువురు నాయకులు పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే.
ఈ రెండు నెలల్లోనే బీజేపీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నిరంతర కార్యాచరణతో ముందుకు వెళ్లడం.ఏపీకి బీజేపీ నమ్మక ద్రోహం చేసిందనీ, బీజేపీ-వైసీపీలు కుట్రరాజకీయాలకు పాల్పడుతున్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కోరుకోవడం అత్యాశే అవుతుందని పలువురు నాయకులు అంటున్నారు.
విభజన తర్వాత జరిగిన గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పడుతుందని ఇప్పటికే చంద్రబాబు అంటున్నారు.
అలాగే.బీజేపీ-వైసీపీ అంటకాగడంపై కూడా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అయితే ఢిల్లీలో మోడీ,ఇ తర నేతలను కలిసి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ కార్యాచరణలో ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.