బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ విషయంలో ముంబై అధికారులు క్షణాల్లో నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.ఆమె ఆఫీస్ బంగ్లా లో అక్రమంగా మార్పులు చేసినట్లు నోటీసులు అంటించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్పుడే కూల్చివేత కార్యక్రమానికి కూడా దిగిపోయారు.
ఈ రోజు ఆమె ఆఫీస్ కు వెళ్లిన బీఎంసీ అధికారులు బుల్డోజర్ల తో కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు.చాన్నాళ్ల నుంచి స్వంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో ఉంటున్న కంగనా రనౌత్.
ఇవాళ ఉదయం చండీఘడ్ మీదుగా ముంబై చేరుకోనున్నది.అయితే తన బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించిన ఫోటోలను కంగనా ట్వీట్ చేసింది.
నేనెప్పుడూ తప్పు చెప్పలేదు, నా శత్రువులు నిజమని ప్రూవ్ చేశారు, అందుకే ఇప్పుడు ముంబై పీవోకేగా మారిందని తన ట్వీట్లో కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.సుశాంత్ ఆత్మహత్య ఘటన తరువాత శివసేన నేతలకు,కంగనా కు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే.
ఈ క్రమంలో ముంబై మరో పీవోకే గా మారింది అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.దీనితో ఆమెను అసలు ముంబై లోకి అడుగుపెట్టనీయం అంటూ సేన నేతలు హెచ్చరించడం తో ఈ రోజు ముంబై వస్తున్నా ఎవరు ఆపుకుంటారో ఆపుకోండి అంటూ కంగనా సవాల్ విసిరింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కంగనా కు సెక్యూరిటీ ని పెంచుతూ వై ప్లస్ భద్రతను ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో ఈ రోజు ముంబై లో కంగనా అడుగుపెట్టనుండడం పై సర్వత్రా ఉత్కంఠత మొదలైంది.
ఇలాంటి సమయంలో ఆమె ఆఫీస్ ను కూల్చివేస్తుండడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.