ఏపీలో కమ్మ సామాజిక వర్గం వర్సెస్ కమ్మ సామాజిక వర్గం అన్నట్లుగా విమర్శలు, ప్రతి కొనసాగుతున్నాయి.ముఖ్యంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ లో కమ్మ సామాజిక వర్గం నాయకులతో పాటు , టీడీపీ లో గెలిచి, వైసీపీ వైపు నిలబడిన ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు పదేపదే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, ఆ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.
వైసీపీ మంత్రి కొడాలి నాని తో పాటు , గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటివారు చంద్రబాబును పరుష పదజాలంతో తిట్టి పోస్తున్నారు.దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు.
వైసీపీ గెలిచిన దగ్గర నుంచి మొన్నటి వరకు ఇదే తంతు కొనసాగింది.ఇక వల్లభనేని వంశీ కొడాలి నాని వంటివారు చేసిన వ్యక్తిగత విమర్శల పై చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం వంటి వ్యవహారాలు కమ్మ సామాజిక వర్గం లో బాగా కదలిక తీసుకు వచ్చాయి.
ఇటీవల జరిగిన కమ్మ వన సమారాధన లోనూ ఇదే అంశంపై చర్చ జరిగింది ఈ సందర్భంగా తమ సామాజిక వర్గాన్ని జగన్ పూర్తిగా టార్గెట్ చేసుకుని సొంత సామాజికవర్గ నేతలతోనే విమర్శలు చేయిస్తున్నారు అని గత కొంత కాలంగా తమ సామాజిక వర్గానికి చెందిన వారందరి పైనా జగన్ వేధింపులకు పాల్పడుతున్నారని , రాజకీయంగానే కాకుండా , వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం ఆ సామాజిక వర్గం లో ఎక్కువగా మొదలైంది.వైసీపీకి కమ్మ సామాజిక వర్గం 2019 ఎన్నికల్లో బాగానే సహకరించింది.30 శాతం కమ్మ సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి పడ్డాయి.మిగిలిన సామాజిక వర్గాలు టీడీపీ వైపు నిలబడ్డాయి.
అయితే కమ్మ సామాజిక వర్గం లో చీలిక తీసుకురావడం ద్వారా, తమ రాజకీయ అడ్డంకులు తొలగించు కోవచ్చు అనే వ్యూహంలో జగన్ ఉండటంతోనే ఈ విధమైన వేధింపులు చోటుచేసుకుంటున్నాయని ఆ సామాజిక వర్గం నేతలు గుర్తించారు.
అందుకే గత కొద్ది రోజులుగా సామాజిక వర్గానికి చెందిన నేతలంతా చర్చించుకుని మరి జగన్ దూకుడుకు బ్రేక్ వేసే విధంగా అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ముందుగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వారిపై కుల బహిష్కరణ వేటు వేయాలని, తమ సామాజికవర్గం అండదండలు వారికి లేకుండా చేయడం ద్వారా, జగన్ ను ఇరుకున పెట్టాలని చూస్తున్నారట.2024 ఎన్నికల్లో చంద్రబాబు కు ముఖ్యమంత్రి పీఠం దక్కకపోతే భవిష్యత్తులోనూ తన సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదనే విషయం ఆ సామాజిక వర్గం వారి మధ్య తీవ్రంగానే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.అందుకే వైసీపీ విషయంలో సానుకూలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలను తమ దారికి తెచ్చుకుని పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా కమ్మ సామాజిక వర్గం అంతా పని చేసే విధంగా ఆ సామాజిక వర్గం ప్రజల్లో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది.