ఏపీలో అధికార వైసీపీలో రోజుకో రగడ తెరమీదకు వస్తోంది.ఈ క్రమంలోనే బెజవాడ వైసీపీలో కమ్మ నేతల మధ్య ఆధిపత్య యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
నగరంలో కీలక నియోజకవర్గం తూర్పు.గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి ప్రస్తుత నగర అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భవకుమార్ పోటీ చేసి ఓడిపోయారు.
అయితే ఎన్నికలకు ముందు ఈ సీటును మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఆశించగా.చివర్లో జగన్ బొప్పన భవకుమార్కే సీటు ఇవ్వగా ఆయన గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు.
ఎన్నికల తర్వాత టీడీపీలో ఉన్న దేవినేని అవినాష్ వైసీపీలోకి రావడం.ఆయన రావడంతోనే విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ అవ్వడం వెంటనే జరిగిపోయాయి.
తూర్పు అధ్యక్షుడు అయ్యారో లేదో అవినాష్ తూర్పు నియోజకవర్గ రాజకీయాల్లో దూసుకు పోవడంతో పాటు తన గ్రిప్ పెంచేసుకున్నారు.వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవినాష్ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ రెడీ చేసుకుంటున్నారు.
అయితే భవకుమార్ పార్టీ నగర అధ్యక్షుడిగా ఉండడంతో ఆయన కూడా తనకూ ఛాన్స్ రాదా ? అని చూస్తున్నారు.తాజాగా సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు వర్గాల మధ్య వివాదం రేగింది.
దేవినేని వర్గం నియోజకవర్గంలోనూ, నగరంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
అయితే పార్టీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఫొటోలు లేవని ఆ వర్గం దేవినేని వర్గంపై మండి పడుతోంది.దీంతో తూర్పు వైసీపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.ఇక తూర్పు వైసీపీలో ఉన్న కమ్మ నేతలు కూడా రెండుగా చీలారు.
ఓ వైపు నగర పార్టీ అధ్యక్షుడు, గత ఎన్నికల్లో పోటీ చేసిన నేత, మరోవైపు అవినాష్ యువనాయకుడు కావడంతో పాటు ప్రస్తుత ఇన్చార్జ్గా ఉన్నారు.ఏదేమైనా తూర్పులో ఈ ఇద్దరి నేతల వార్కు అధిష్టానం చెక్ పెట్టి పంచాయితీ చేయకపోతే పార్టీ నష్టపోక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.