అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ప్రపంచంలో కోవిడ్ బారినపడి ఎక్కువగా నష్టపోయింది అగ్రరాజ్యమే.ప్రస్తుతం 59,56,036 మంది వైరస్ బారినపడ్డారు.1,82,412 మంది ప్రాణాలు కోల్పోయారు.వీరిలో 32,54,739 మంది కోలుకున్నారు.ఇదే సమయంలో అక్కడ అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.కరోనా కారణంగా నిన్న మొన్నటి వరకు ప్రచారం అంతంత మాత్రంగానే సాగింది.
అయితే ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు దూకుడు పెంచారు.
నిత్యం రోడ్ షోలు, ప్రజలను నేరుగా కలవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇదే సమయంలో పోటీలో నిలిచిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ నేత జో బిడెన్ల వయసు 70 ఏళ్లకు పైబడి ఉండటంతో వీరి ఆరోగ్యం పట్ల నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీంతో డొమొక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్, ఉపాధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్లు ప్రతిరోజూ క్రమం తప్పకుండా కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకుంటున్నారు.
కోవిడ్ టెస్టు చేయించుకున్నారా.? అని పలుమార్లు విలేకరులు అడిగిన ప్రశ్నకు బిడెన్ నుంచి లేదనే సమాధానం వచ్చింది.ఈ నేపథ్యంలో క్రమం తప్పకుండా కరోనా టెస్టు చేయించుకునేందుకు బిడెన్-హారిస్ సిద్ధమవడం విశేషం.
వీరితో నిత్యం సన్నిహితంగా ఉండే సిబ్బందికి కూడా నిర్థారణా పరీక్షలు చేస్తామని బిడెన్ సన్నిహితుడు వెల్లడించారు.కాగా మార్చిలో కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి బిడెన్ కొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కానీ ఎక్కువ శాతం ఇంటి నుంచే వర్చువల్ డిబేట్లలో పాలు పంచుకునేవారు.గతవారం జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో ఆయన అధికారికంగా నామినేట్ అయ్యారు.