మెక్సికో నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు గాను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి తలపెట్టిన సంగతి తెలిసిందే.ట్రంప్ మానసపుత్రికగా అభివర్ణించిన ఈ భారీ నిర్మాణానికి ఆయన ఎన్నో వేల కోట్లను వెచ్చించారు.
అంతేకాకుండా పలు కార్యక్రమాలకు ఉద్దేశించిన నిధులను గోడ నిర్మాణం కోసం దారి మళ్లించారు.ఈ గోడ నిర్మాణానికి నిధులు మళ్లించడం కోసం 2019లో జాతీయ ఎమర్జెన్సీని ట్రంప్ ప్రకటించారు.
అయితే జో బైడెన్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెక్సికో గోడ నిర్మాణ ప్రాజెక్టులన్నింటినీ ఆపేయాలని ఆదేశించారు.
ఈ ప్రాజెక్టుకు అందజేస్తున్న నిధుల చట్టబద్ధతను, కాంట్రాక్ట్ పద్ధతులను సమీక్షించాలని సూచించారు.
సైనికుల పిల్లలకు స్కూళ్ళ నిర్మాణానికి, విదేశాల్లో భాగస్వామ్య దేశాలతో కలిసి మిలటరీ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడానికి, జాతీయ రక్షణ బలగాలు, రిజర్వ్ బలగాల సామాగ్రి కోసం ఈ నిధులను ఖర్చు చేయాల్సి వుండగా వాటిని గోడ నిర్మాణానికి మళ్లించడాన్ని బైడెన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాజెక్టులను రద్దు చేస్తున్నట్లు పెంటగాన్ ఈ ఏడాది మేలో ప్రకటించింది.
అయితే మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసదారులకు తలుపులు తెరిచి బైడెన్.దేశ భద్రతను ప్రమాదంలో పడేశారని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.ఈ నేపథ్యంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రంగంలోకి దిగారు.దీనిలో భాగంగా రేపు మెక్సికో సరిహద్దును పరిశీలించనున్నారు.సెంట్రల్ అమెరికాలో పేదరికం, అంతర్యుద్ధం, హింస వంటి కారణాల వల్ల లక్షలాది మంది వలసదారులు అమెరికాకు వలస వెళ్తున్నారు.ఇటీవలి నెలల్లో ఇది మరింత ఎక్కువైంది.
అధ్యక్షుడు జో బైడెన్ మితిమీరిన మానవీయ విధానం వల్ల ఇమ్మిగ్రేషన్ విధానం సంక్షోభంలో కూరుకుపోతోందని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో టెక్సాస్ సరిహద్దు నగరమైన ఎల్ పాసోను కమలా హారిస్, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో మయోర్కాస్ సందర్శిస్తారని హారిస్ సీనియర్ సలహాదారు సిమోన్ సాండర్స్ వెల్లడించారు.
ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, హోండూరాస్ల నుంచి పెరుగుతున్న వలసలను పర్యవేక్షించి, వాటిని నివారించే బాధ్యతలను జో బైడెన్ కమలా హారిస్కు అప్పగించారు.దీనిలో భాగంగానే ఉపాధ్యక్షురాలు గ్వాటెమాల, మెక్సికోలకు వెళ్లారు.అక్రమ వలసలకు మూల కారణాలను వెతుకుతూ హారిస్ పరిష్కరిస్తూ.పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు సమన్వయంతో పనిచేస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ మీడియాకు తెలిపారు.
కాగా, జూన్ 30న డొనాల్డ్ ట్రంప్ మెక్సికో సరిహద్దును పరిశీలించాలని నిర్ణయించారు.దానికి కొద్దిరోజుల ముందు కమలా హారిస్ పర్యటన నేపథ్యంలో ఇది అమెరికా రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.