అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ డెమొక్రాటిక్, రిపబ్లిన్ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.ఇదే సమయంలో అభ్యర్ధుల గెలుపోటములు నిర్దేశించే భారత సమాజం మద్ధతు ఈసారి డెమొక్రాట్ల వైపే వుందని ఇటీవల సర్వేలో తేలడంతో రిపబ్లికన్లలో ఓ కలవరం మొదలైంది.
భారత సంతతికి చెందిన కమలా హారిస్ను జో బిడెన్ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపిక చేయడాన్ని అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయులు స్వాగతించారు.దీంతో జనంలో ఆమె పాపులారిటీ పెరిగిపోతోంది.
కమలా హారిస్పై తొలి నుంచి గుర్రుగా ఉన్న ట్రంప్ వీలు చిక్కినప్పుడల్లా విరుచుకుపడుతూ వస్తున్నారు.ఆమె కన్నా తనకే ఎక్కువమంది భారతీయుల మద్ధతు ఉందని వ్యాఖ్యానించారు.కమలా హారిస్ను అమెరికా ప్రజలు ఇష్టపడబోరని, ఒకవేళ ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పటికీ అమెరికాకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అయ్యే ఛాన్స్ లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.తాజాగా ఇప్పుడు ట్రంప్ తనయుడు ఎరిక్ ట్రంప్ సైతం తండ్రి బాటలో నడుస్తున్నాడు.
అట్లాంటాలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఆయన భారతీయులను ఆకట్టుకునేలా ప్రసంగించారు.ఇదే సమయంలో కమలా హారిస్పై విమర్శనాస్త్రాలు సంధించారు ఎరిక్.ఆమె స్వయంగా భారతీయ సమాజానికి చెందిన వారైనప్పటికీ భారతీయ అమెరికన్లు కమలా హారిస్ను దూరంగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు.భారతీయ వారసత్వాన్ని గురించి ఘనంగా చెప్పుకోవటమే తప్ప ఆమె చేసిందేమీ లేదని ఎరిక్ ఎద్దేవా చేశారు.
హారిస్ చెప్పే మాటలకు, ఆమె చేసే పనులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన విమర్శించారు.
భారతీయ సమాజం ఎప్పుడూ అత్యుత్తమమైన వారినే ఎన్నుకుంటుందని.
తన తండ్రి ట్రంప్ కూడా భారతీయులను ఎన్నడూ నిరాశ పరచలేదని ఎరిక్ స్పష్టం చేశారు.తమ కుటుంబం ఇండియన్లను ఎంతగానో ప్రేమిస్తుందని ఆయన తెలిపారు.
ఇటీవల నిర్వహించిన ‘ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్’ కార్యక్రమ ప్రారంభోత్సవంలోనూ ఎరిక్ పాల్గొన్నారు.చైనా, పాకిస్తాన్ అంశాల్లో గత అమెరికా అధ్యక్షుల కంటే ట్రంప్ వైఖరి చాలా భిన్నంగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు.
కానీ ట్రంప్ ఎల్లప్పూడు భారత్ వైపే ఉన్నారని, భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటారని ఎరిక్ స్పష్టం చేశారు.