అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా, తొలి భారత సంతతి ఉపాధ్యక్షురాలిగా, తొలి నల్లజాతి ఉపాధ్యక్షురాలిగా తన పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన కమలా హారిస్కు ఇప్పటికీ ప్రపంచ నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతూనే వున్నాయి.ఈ క్రమంలో ఆమెకు అరుదైన గౌరవం దక్కింది.
అమెరికా రాజధాని వాషింగ్టన్లోని ప్రపంచ ప్రఖ్యాత లింకన్ మెమోరియల్ వద్ద గాజుతో తయారు చేసిన కమలా హారిస్ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. అమెరికా మహిళల విజయానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన ఈ చిత్ర పటం పూర్తిగా గాజుతో రూపొందించారు.
ఫిబ్రవరి 6 నుంచి ఇది లింకన్ స్మారకం వద్ద సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.ఆరున్నర అడుగుల పొడవు, వెడల్పు వున్న చిత్ర పటాన్ని.స్విట్జర్లాండ్కు చెందిన సిమోన్ బెర్గర్ అనే కళాకారుడు రూపొందించాడు.దీనిని తయారు చేయడం క్లిష్టమైన ప్రక్రియ.
ఈ చిత్రపటాన్ని చూసిన వారు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు గాను దీని మీద నిర్వాహకులు క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేశారు.ఈ శిల్పాన్ని నేషనల్ వుమెన్స్ హిస్టరీ మ్యూజియం బహూకరించింది.
అబ్రహం లింకన్ అమెరికాలో బానిసత్వాన్ని రూపు మాపేందుకు అనేక చర్యలు తీసుకున్నారు.చెప్పులు కుట్టే స్థాయి నుంచి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎదిగి తరతరాలకు స్పూర్తిగా నిలిచారు.ప్రజాస్వామ్యానికి అసలు సిసలు నిర్వచనం చెప్పిన మహనీయులు.లింకన్ స్మారకార్థం అమెరికా ప్రభుత్వం వాషింగ్టన్లోని నేషనల్ మాల్కు పశ్చిమ దిశలో లింకన్ మెమోరియల్ను నిర్మించింది.దీని విస్తీర్ణం 27,336 చదరపు అడుగులు.1914లో దీని నిర్మాణం ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం 1922 నాటికి పూర్తి చేసింది.ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హెన్రీ బేకన్.లింకన్ మెమోరియల్కు డిజైన్ చేశారు. 2019లో రికార్డు స్థాయిలో 78,08,182 మంది ఈ స్మారక స్థలాన్ని సందర్శించారు.ఇక్కడ వున్న భవంతిలో కుర్చీలో కూర్చున్నట్లుగా వుండే అబ్రహం లింకన్ భారీ విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటుంది.
అమెరికాతో పాటు ప్రపంచ గతిని మార్చిన అనేక ఉద్యమాలకు, సమావేశాలకు లింకన్ మెమోరియల్ వేదికైంది.నల్లజాతి హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ ‘‘I have a Dream ’’ నినాదం ఇక్కడి నుంచి ఇచ్చిందే.1963లో ఆయన నిర్వహించిన భారీ బహిరంగ సభకు 2,50,000 మందికిపైగా హాజరయ్యారని అంచనా.అంతటి విశిష్టత కలిగిన లింకన్ మెమోరియల్ వద్ద భారత సంతతికి చెందిన మహిళకు గౌరవం దక్కడం భారతీయులందరికీ గర్వకారణం.