కరోనా సెకండ్ వేవ్ భారత్ లో ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోందో అందరికి తెలిసిందే.గతంలో అమెరికాను చూసి జాలి పడిన ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ పై సానుభూతిని ప్రకటిస్తున్నాయి.
కరోనా మొదటి వేవ్ సమయంలో భారత్ కరోనాతో ఇబ్బందులు పడుతున్న దేశాలకు భారీగానే సాహాయాన్ని అందించింది.దాంతో ప్రస్తుతం కరోనాకోరల్లో చిక్కుకున్న భారత్ కు సాయం చేసేందుకు అన్ని దేశాలు ముందుకు వచ్చాయి.
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు గతంలోనే భారత్ కు సాయం చేస్తామని ప్రకటించి వైద్య పరికరాలు వ్యాక్సిన్ కు కావాల్సిన ముడిసరుకు ను పంపిన విషయం విధితమే.
అయితే అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారీస్ తాజాగా భారత్ కు సాయం చేసే విషయంపై భారత ప్రధాని మోడీ తో మాట్లాడారు.
కరోనాతో ఇబ్బందులు పడుతున్న భారత్ కు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.భారత్ తమకు ముఖ్యమైన స్నేహ దేశమని తెలిపిన కమలా అన్ని విధాలా సహకరిస్తామని మోడీ కి హామీ ఇచ్చారు.
ఇప్పటికే భారత్ కు పలు రకాలుగా సాయం అందించామని గుర్తు చేసిన కమలా భవిష్యత్ లో వ్యాక్సిన్ లు అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్టుగా తెలిపారు.అంతర్జాతీయంగా దాదాపు 25 మిలియన్ ల కరోనా వ్యాక్సిన్ లు పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఆమె తెలిపారు.
ఈ విషయంపైనే మోడీతో సుదీర్ఘంగా కమలా చర్చించినట్టుగా తెలుస్తోంది.అయితే ఏ వ్యాక్సిన్ లు అందిస్తారనే విషయంపై ఎలాంటి ప్రకటన విడుదల అవలేదు.అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ లు వేసిన తరువాత కరోనా నియంత్రణపై ప్రభుత్వం పూర్తీ స్థాయిలో పట్టు సాధించగలిగింది.ఈ మేరకు నిపుణులు సైతం ఫైజర్ వ్యాక్సిన్ పైనే ఆసు పెట్టుకున్నారు.
అయితే కేవలం భారత్ కు మాత్రమే కాకుండా వ్యాక్సిన్ ను మరో మూడు దేశాలకు పంపేందుకు అమెరికా సిద్దంగా ఉందని తెలుస్తోంది.ఈ మేరకు కమలా హారీస్ మోడీ తో మాట్లాడారని తెలుస్తోంది.
వ్యాక్సిన్ లు భారత్ కు పంపుతామని కమలా హామీ ఇవ్వడంతో మోడీ ఆమెకు కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేశారు.