ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూనే ఉంది.ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీ సిసోడియా అరెస్టు కాగా, ఆయనతో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారు.
ఇక బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( kalvakuntla kavitha )ను ఇప్పటికే రెండుసార్లు ఈడి అధికారుల విచారణకు హాజరయ్యారు.
ఈ క్రమంలోని ఈడీ అధికారులను ఉద్దేశించి ఈ రోజు కవిత సంచలన లేఖ రాశారు.
ముఖ్యంగా ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్రను ఉద్దేశించి కవిత సంచలన విమర్శలు చేశారు.ఫోన్లు ధ్వంసం చేశానని తనపై ఆరోపణలు చేయడాన్ని కవిత తప్పుపట్టారు.ఈడి( ED ) దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ, తాను గతంలో వాడిన ఫోన్లను అధికారులకు సమర్పిస్తున్నట్లు తెలిపారు.ఒక మహిళ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా అంటూ కవిత ప్రశ్నించారు.
” దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ఫోన్లు ధ్వంసం చేశానని పేర్కొంది.కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా, ఏమీ అడగకుండానే ఈ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ? నన్ను తొలిసారిగా మార్చ్ లో విచారణ కోసం ఈడీ పిలిచింది.కానీ గతేడాది నవంబర్ లోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశం పూర్వకంగా, తప్పుడు ఆరోపణలు చేయడమే.తప్పుడు ఆరోపణలు ఉదేశపూర్వకంగా లీక్ చేయడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు.
తద్వారా నా ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా, నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది.
రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడి వంటి దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమంటూ కవిత లేఖలో సంచలన విమర్శలు చేశారు.ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో మూడో రోజు కవిత విచారణకు హాజరయ్యారు.ఈ విచారణకు హాజరయ్యే ముందే ఈ లేఖను కవిత విడుదల చేయడం సంచలనంగా మారింది.
కవిత చేసిన ఆరోపణలపై ఈడి అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.