వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.ఈ సంఘటన కంభంలో చోటుచేసుకుంది.
వివరాల లోకి వెళ్తే.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం రమణీయపేటకు చెందిన డి.విజయ్ రంజన్, వలవల క్రాంతి తేజ కాకినాడలో బీ ఫార్మసీ చదువుతున్నారు.వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది.
వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని పది రోజుల క్రితం కాకినాడ నుంచి ఓ కారులో కంభం వచ్చారు.రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.అనంతరం కంభంలోని విజయరంజన్ బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు.
వారిద్దరూ కంభంలో ఉన్నారని తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు 20 మందితో కలిసి గురువారం కంభం వచ్చారు.నూతన దంపతుల కోసం గాలిస్తుండగా తమ ప్రాంతానికి చెందిన నంబర్ ప్లేటుతో ఉన్న కారు వారి కంటపడింది అందులో ఉన్న విజయ్ రంజన్ను పట్టుకొని మందలించగా వారిని క్రాంతి తేజ వద్దకు తీసుకొచ్చాడు.అనంతరం క్రాంతితేజ, వారి వద్ద ఉన్న ల్యాప్ టాప్, ఇతర వస్తువులు తీసుకెళ్లిపోయారు.భర్త విజయరంజన్ తన భార్యను ఆమె పెదనాన్న వలవల వెంకటేశ్వర్లు, బాబాయి బాబ్జి, మరో 20 మందికిపైగా రౌడీలు వచ్చి తనపై దాడి చేసి దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్త ఇక్కడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు.