తెలుగు ఇండస్ట్రీలోకి కాజల్ ఎంట్రీ ఇచ్చి దగ్గర దగ్గరగా పదేళ్లు అవుతోంది.ఆమె వెనక వచ్చిన కథానాయికలు కూడా శుభ్రంగా తెలుగు నేర్చేసుకొని మాట్లాడేస్తున్నారు.
సొంతంగా డబ్బింగ్ లు చెప్పడమే కాదు ఏకంగా పాటలు కూడా పాడేస్తున్నారు.కానీ కాజల్ నోటి నుంచి మాత్రం తెలుగు పదమే వచ్చేది కాదు.
ఆ విషయంపై చాలా విమర్శలే వచ్చేవి.నాకు తెలుగు అంతా తెలుసు.
కానీ మాట్లాడలేను అని సర్దిచెప్పేది కాజల్.అయితే ఈసారి మాత్రం ఆమె ధైర్యం చేసింది.
`సర్దార్ గబ్బర్ సింగ్` కోసం డబ్బింగ్ చెప్పేసింది.ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించింది.
మూడు రోజుల క్రితమే ఆమె డబ్బింగ్ ముగించినట్టు సమాచారం.అది కూడా స్వచ్ఛమైన తెలుగు భాషని మాట్లాడిందట.
మొదట్లో భయపడ్డాను కానీ… నా డబ్బింగ్ భలే ఉంది స్వతహాగా నాకు చాలా బాగా నచ్చింది అంటోంది కాజల్.మరి కాజల్ చిలుక పలుకులు ఎలా ఉన్నాయో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 8వరకు ఆగాల్సిందే. పవన్ కళ్యాణ్ సరసన నటించడం కూడా బోలెడంత సంతోషాన్నిచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.“ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజు నుంచే పవన్ తో కలిసి నటించాలనే కోరిక ఉండేది.కానీ డేట్లు సర్దుబాటు అయ్యేవి కాదు.ఎట్టకేలకు ఈ సినిమాతో పవన్ తో కలిసి నటించా“ అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది కాజల్.ఇటీవల కథానాయికలంతా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.ఊపిరి కోసం తమన్నా కూడా సొంత గొంతుని వినిపించింది.
ఇప్పుడు కాజల్ ఆ జాబితాలోకి చేరిందన్నమాట.ఇది తెలుగు ఇండస్ట్రీకి ఓ మంచి పరిణామమే అని చెప్పొచ్చు.