ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయంగా వేస్తున్న అడుగులు కామెడిగాను, అనుమానాస్పదనంగానూ ఉండడంతో తరుచూ ఆయన వార్తల్లోకి ఎక్కుతున్నారు.ఏపీ ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు అధికారం దక్కించుకుని అభివృద్ధిలో ఆంధ్రాని అమెరికా చేస్తాను అంటూ ప్రకటించి సంచలనం రేపుతున్నాడు.
ఇక పాల్ మీద వస్తున్న ఆరోపణలను పరిగణలో తీసుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడని.వైసీపీ జెండాను పోలిన విధంగా జెండా ఉండడం, వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలి ఉండేలా ప్రశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు ఉండడం అనేక అనుమానాలు కలిగిస్తోంది.
ఈ పార్టీ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉంది అనే ఆరోపణలు కూడా జోరుగా వస్తుండడంతో పాల్ వివరణ ఇచ్చాడు.తమ పార్టీ అభ్య ర్థులకు ఇచ్చిన బీఫాంలను టీడీపీ, వైసీపీ నేతలు దొంగిలించారు అంటూ కొత్త వాదాన్ని ఎత్తుకున్నాడు.శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.విజయవాడలోని ఐలాపురం హోటల్లో తమ పార్టీ ప్రతినిధులపై దాడి చేసి బీఫాంలను ఎత్తుకెళ్లారని, అందులోని పేర్లను పోలిన అభ్యర్థులతో నామినేషన్లు వేయించారని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోడు దొంగలని ధ్వజమెత్తిన పాల్ వారు ఏపీలో గెలిచే అవకాశమే లేదు అంటూ చెప్పుకొచ్చాడు.
తాను చంద్రబాబు మనిషిని అంటూ వస్తున్న ఆరోపణలు నిజం కాదని, తాను బాబు మనిషిని అయితే టీడీపీని ఓడించాలని ఎందుకు చెబుతానని ప్రశ్నించారు.ఢిల్లీలో కేజ్రీవాల్ను గెలిపించినట్లే ఆంధ్రాలో ప్రజాశాంతి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే నర్సాపురాన్ని నార్త్ అమెరికా చేస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు.
అంతే కాకుండా ఓటర్ల జాబితాలో అవకతవకలపై విచారణ చేసే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.ఎన్నికలను వాయిదా వేయకపోతే తామే బహిష్కరిస్తామని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.