కేఏ పాల్ ! రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు.రాజకీయ పార్టీని స్థాపించి 2019 ఎన్నికల్లో పోటీకి దిగినా, సక్సెస్ అందుకోలేకపోయారు.
అయినా ఏపీ, తెలంగాణ రాజకీయాల పై స్పందిస్తూ, తన ఉనికిని చాటుకుంటూ ఉంటారు.అయితే ఆయన ను అంతా కామెడీ గానే అంతా చూస్తుంటారు.
జనాలు ఎవరూ పాల్ ను పట్టించుకోనట్లుగానే ఉంటున్నారు.అయితే ఇప్పుడు అదే పాల్ ఏపీ రాజకీయాల్లో తన సత్తా చాటుకుంటూ ఇప్పుడు జేజేలు కొట్టించుకోవడం చర్చనీయాంశం అయ్యింది.
ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోంది.ఎట్టిపరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అని, వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానం కాదు అని, సంక్షేమమే ప్రభుత్వ విధానం అంటూ చెబుతోంది.
ఇక స్టీల్ ప్లాంట్ ఉద్యమం లో ఏపీ అధికార పార్టీ వైసిపి, టిడిపి పోరాటం చేస్తున్న అది కేవలం తూతూ మంత్రంగానే ఉంది. ఇక స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు , కార్మికులు నిత్యం నిరసన కార్యక్రమాలు చేపడుతూ, ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే కె.ఎ.పాల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ సైతం వేయడం ఆయన ఫోటోలకు స్టీల్ ప్లాంట్ కార్మికులు పాలాభిషేకం చేయడం వంటివి జరిగాయి.కానీ ఈ విషయాన్ని కే ఏ పాల్ ఇక్కడితో వదిలి పెట్టే విధంగా లేరు.
ఇప్పుడు ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ ఉద్యమ వేడి రగిలించేందుకు సిద్ధమయ్యారు.ఈ నెల 21వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు పాల్ సిద్ధమవుతున్నారు.
స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని , అప్పటివరకు తన దీక్ష విరమించేది లేదని ప్రకటించారు.
ఇక ఈ ఉద్యమం ను అంతర్జాతీయ స్థాయిలోనూ ఫోకస్ అయ్యే విధంగా పాల్ ప్లాన్ చేసుకోవడంతో, ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే కె పాల్ ఈ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని, ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కేఏపాల్ హీరో గా మారే అవకాశం కనిపిస్తోంది.కేంద్రం స్టీల్ ప్లాంట్ విషయంలో సానుకూలంగా స్పందించినా, స్పందించకపోయినా ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసిన వ్యక్తిగా ఏపీ ప్రజలకు ఆయన గుర్తుండిపోతారు అనడం లో సందేహం లేదు.
.