ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటమే లక్ష్యంగా భారతీయ రైల్వేలలో నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి.జనాలకు ఏది అవసరమో దాని ప్రాతిపదికన అధికారులు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు.
అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా రైళ్లను ఆపేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.అయితే దీనివల్ల రైల్వే శాఖ చాలా నష్టపోయినప్పటికీ ఇప్పుడిప్పుడే కొత్త రాయతీలను ప్రవేశపెడుతోంది.
దీంతో పాటుగా మరికొన్ని నూతన సౌకర్యాలను కూడా ప్రయాణికులకు కల్పిస్తుంది.
అయితే తాజాగా రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటిసి సంచలన నిర్ణయం తీసుకుంది.
ఐఆర్సీటిసి కొన్ని రైళ్లను ‘సాత్విక్ సర్టిఫైడ్‘ పొందడం ద్వారా వెజిటేరియన్ ఫ్రెండ్లీ ట్రావెల్ ను ప్రోత్సహించాలని యోచిస్తోంది.ఇందులో భాగంగా త్వరలో కొన్ని రైళ్లలో శాకాహారం మాత్రమే అందిస్తామని ప్రకటించింది.
ఐఆర్సీటిసి రైళ్లలో ఇలా శాకాహారం అందించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.అయితే ఈ సౌకర్యం ఎంపిక చేసిన మార్గాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మతపరమైన ప్రదేశాలకు వెళ్ళే రైలు మార్గాలలో శాఖాహార సేవలను ప్రారంభించడానికి సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఐఆర్సీటీసీ తో ఒప్పందం కుదుర్చుకుంది.ఢిల్లీ నుంచి కత్రా వెళ్లే రైలు చివరి స్టాప్ వైష్ణో దేవి ఆలయం ఉండడంతో సాత్విక్ సర్టిఫికెట్ పొందే అవకాశం మొదటి రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు దక్కింది.అలాగే కొత్తగా ప్రారంభించిన రామాయణ ఎక్స్ప్రెస్ తో సహా మరో 18 నెలల్లో ఈ ఫార్ములాను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు.
వారణాసి నుంచి ఇండోర్ మధ్య నడుస్తున్న కాశి మహాకాల్ ఎక్స్ప్రెస్ లో సోమవారం నుంచి ఈ ఫార్ములా ప్రారంభం కానుంది.ఐఆర్సిటిసి బేస్ కిచెన్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్లు, బడ్జెట్ హోటల్ లు, ఫుడ్ ప్లాజాలు, ట్రావెల్ అండ్ టూర్ ప్యాకేజీలు, రైల్ నీర్ ప్లాంట్లు ‘సాత్విక్’ సర్టిఫికెట్ పొందుతాయని, అలాగే శాకాహార వంటశాలలపై హ్యాండ్ బుక్ ను కూడా విడుదల చేయనున్నట్లు సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది.