అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్న జో బైడెన్.భారతీయ సమాజం నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మందికి పైగా ఇండో అమెరికన్లకు తన జట్టులో స్థానం కల్పించారు బైడెన్.రానున్న రోజుల్లో ఈ లిస్ట్ మరింత పెరిగే అవకాశం వుంది.అలాంటి బైడెన్.ఓ భారత సంతతి వ్యక్తిని మాత్రం పదవిలోంచి తొలగించారు.
అధ్యక్షుడిగా వైట్హౌస్లో అడుగుపెట్టిన నాటి నుంచి ట్రంప్ తీసుకున్నపలు నిర్ణయాలను పున: సమీక్షిస్తూ వస్తున్న బైడెన్ ఇప్పటికే కొన్నింటిని రద్దు చేయగా, మరికొన్ని వాయిదా వేశారు.ఈ క్రమంలో భారత సంతతి న్యాయవాది విజయ్ శంకర్ను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
వాషింగ్టన్లోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్కు జడ్జిగా నామినేట్ చేశారు.అధికారం నుంచి దిగిపోవడానికి రెండు వారాల ముందే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, విజయ్ శంకర్ను జడ్జిగా నియమించడానికి ట్రంప్ చేసిన ప్రతిపాదనను కొత్త అధ్యక్షుడు జో బైడెన్ గురువారం రద్దుచేశారు.
అధ్యక్షుడిగా దిగిపోవడానికి కొద్ది నెలల ముందు ట్రంప్ చేపట్టిన 32 నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఉపసహరించే నోటిఫికేషన్ను బైడెన్ సెనేట్కు పంపారు.
ఈ లిస్ట్లో భారతీయ అమెరికన్ విజయ్ శంకర్ పేరు కూడా ఉండటం గమనార్హం.గతేడాది జూన్లోనే విజయ శంకర్ నియామకంపై ట్రంప్ ప్రకటన చేశారు.
వాషింగ్టన్ డీసీలోని అత్యున్నత న్యాయస్థానానికి భారత సంతతికి చెందిన విజయ్ శంకర్ను అసోసియేట్ న్యాయమూర్తిగా నియమించనున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.ఈ అంశంలో సెనేట్ ఆమోదం లభిస్తే, కొలంబియా కోర్ట్ ఆఫ్ అపీల్స్కు విజయ శంకర్ జడ్జి అవుతారని ట్రంప్ అప్పట్లో పేర్కొన్నారు.
అయితే ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు సెనేట్.శంకర్ నామినేషన్ తీసుకోలేదని సమాచారం.
అయితే అమెరికాలో జడ్జిల నియామకం అనేది పూర్తిగా రాజకీయాలకు సంబంధించిన విషయం.పార్టీ విధేయులుగా ఉన్నవారిని అధ్యక్షుడు న్యాయమూర్తులుగా నియమించడం జరుగుతుంది.ఫెడరల్ ప్రాసిక్యూటర్లను కూడా పార్టీ తరఫున నియమిస్తారు.అలాగే న్యాయమూర్తుల మాదిరిగానే వారి నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది.ప్రస్తుతం న్యాయశాఖ క్రిమినల్ విభాగంలో సీనియర్ లిటిగేషన్ కౌన్సిల్గా, అప్పిలేట్ సెక్షన్ డిప్యూటీ చీఫ్గా విజయ్ శంకర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.2012 నుంచి న్యాయ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న శంకర్.అంతకు ముందు వాష్టింగ్టన్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.మేయర్ బ్రౌన్, ఎల్ఎల్సీ, కోవింగ్టన్ అండ్ బర్లింగ్, ఎల్ఎల్సీల తరఫున పలు కేసులను వాదించారు.న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ సెకెండ్ సర్క్యూట్ జడ్జ్ చెస్టర్ జే స్ట్రాబౌ వద్ద క్లర్క్గా ఉన్నారు.న్యాయశాస్త్రంలో డ్యూక్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, వర్జీనియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తిచేశారు.
అనంతరం వర్జీనియా లా రివ్యూకి నోట్స్ ఎడిటర్గా విజయశంకర్ పనిచేశారు.