అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత గతంలో ఎన్నడూ చూడని ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జో బైడెన్ ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బైడెన్ తొలి సంతకం దేనిపై చేస్తారు…? ఆయన తొలి ప్రకటన ఏంటీ అంటూ అగ్రరాజ్యంలో పెద్ద చర్చ నడుస్తోంది.తాను శ్వేతసౌధంలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెడతానని, కరోనా వైరస్ను నియంత్రిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
అందుకు తగ్గట్టుగానే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కోవిడ్ టాస్క్ఫోర్స్ పేరిట నిపుణులతో ఓ కార్యదళాన్ని ఏర్పాటు చేశారు. అయితే బాధ్యతలు చేపట్టిన తొలిరోజే బైడెన్ పలు కీలక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేసేందుకు సిద్ధమవుతున్నారని వైట్ హౌస్లో కాబోయే చీఫ్ ఆఫ్ స్టాఫ్ రోన్ క్లెయిన్ తెలిపారు.
ప్రమాణ స్వీకారం ముగిసి ఓవల్ ఆఫీస్లో బాధ్యతలు చేపట్టిన వెంటనే దాదాపు 12 కీలక దస్త్రాలపై జో బైడెన్ సంతకం చేస్తారని రోనీ వెల్లడించారు.అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రకటించారు.
పారిస్ ఒప్పందంలో తిరిగి చేరడం, కొవిడ్ ఆంక్షల్ని విస్తరించడం, ముస్లిం దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం వంటి కీలక అంశాలు ఇందులో ఉంటాయని అంచనా.
రెండో రోజు కరోనా వ్యాప్తిని అరికట్టడం, విద్యా సంస్థలు తిరిగి తెరిచేందుకు సాధ్యాసాధ్యాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బైడెన్ దృష్టి సారిస్తారని అధికారులు తెలిపారు.కోవిడ్ టెస్టులు పెంచడం, కరోనా వారియర్స్కు మరింత రక్షణ కల్పించడం, వైద్యారోగ్య ప్రమాణాల్ని పెంచే దిశగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.అలాగే ప్రజలంతా ఖచ్చితంగా 100 రోజులు మాస్క్ పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేసే ప్రతిపాదనపైనా బైడెన్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.