అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఎలాంటి హామీలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా అమలు చేసేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు జో బైడెన్.కోవిడ్తో ఉపాధి కోల్పోయి ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న అమెరికన్లను ఆదుకునేందుకు తాను ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తానని చెప్పిన బైడెన్.అన్న మాట ప్రకారం 1.9 ట్రిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.138.88 లక్షల కోట్లు) ప్యాకేజీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు ఆమోద ముద్ర వేశారు. ‘ద అమెరికన్ రెస్క్యూ ప్లాన్’ పేరుతో ప్రకటించిన ఈ భారీ ప్యాకేజీ ద్వారా ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించనున్నారు బైడెన్.దీనిలో భాగంగా ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో 2 వేల డాలర్లు చొప్పున జమకానున్నాయి.
కరోనాతో తీవ్ర అవస్థలు పడుతున్న పౌరులకు ఇప్పటికే చెల్లించిన 600 డాలర్లు సరిపోవని బైడెన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.అమెరికన్లు ఆకలితో అలమటించకూడదని ఆయన స్పష్టంచేశారు.
దీనితో పాటు అద్దె ఇళ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయడంపైనా ఆంక్షలు విధించాలని బైడెన్ ఆదేశించారు.
అమెరికా అధ్యక్షుడిగా తన ప్రమాణస్వీకారానికి ముందే ఈ నెల 15న బైడెన్ ఈ ప్యాకేజ్ ప్రకటించిన విషయం తెలిసిందే.కోవిడ్ను ఎదుర్కోవడంతో పాటు , ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే లక్ష్యంగా ఆయన ఈ భారీ ప్యాకేజీని ప్రతిపాదించారు.దీని కింద 1.9 ట్రిలియన్ డాలర్లను కేటాయిస్తామని బైడెన్ వెల్లడించారు.ఈ నిధులతో కరోనా టెస్టులు, టీకా పంపిణీ, పౌరులకు నేరుగా ఆర్థిక సాయం, చిరు వ్యాపారులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.కరోనా కారణంగా 1.8 కోట్ల మంది అమెరికన్లు ఇంకా ప్రభుత్వం అందిస్తోన్న నిరుద్యోగ బీమాపైనే ఆధారపడుతున్నారు.దీనితో పాటు దాదాపు 4 లక్షల చిన్న సూక్ష్మ తరహా వ్యాపార సంస్థలు శాశ్వతంగా మూతపడ్డాయి.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి రోజున 15 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు బైడెన్.
వాటిలో మొదటిది కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించినది.మిగతావి వాతావరణ మార్పులు, వలస విధానాలకు సంబంధించి ట్రంప్ తీసుకున్న విధానాలను రద్దు చేయడానికి సంబంధించిన ఆదేశాలు.