కరోనా ఎలా పుట్టింది.? జంతువు నుంచా.? చైనా జీవయుధమా.? శాస్త్రవేత్తల పొరపాటు వల్ల ల్యాబ్ నుంచి లీకైందా.? దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవే.ఇప్పటికే కోట్లాది మందిని ప్రభావితం చేసి.35 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి పుట్టినిల్లు ఎక్కడ అన్నదానికి సమాధానం లేదు.ఇప్పటి వరకు ప్రపంచానికి అందుబాటులో వున్న సమాచారం ప్రకారం.
వుహాన్లోని మాంసం మార్కెట్ నుంచే ఇది మనుషులకు సోకిందట.తొలి నాళ్లలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వుహాన్ ల్యాబ్పై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు అంతర్జాతీయ బృందానికి అమెరికా నాయకత్వం వహిస్తుందని తెలిపారు.తదనంతర కాలంలో ఎన్నికల హడావిడి, అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమితో ఇది అటకెక్కింది.
అయితే ఇటీవలి కాలంలో వుహాన్ ల్యాబ్కు సంబంధించి ‘‘ ది బులెటిన్.ఓఆర్జీ’’ ప్రచురించిన కథనాలు నాటి ట్రంప్ వాదనకు బలం చేకూర్చింది.
ఆ తర్వాత వరుస పెట్టి.మరిన్ని వాదనలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగారు.కరోనా మూలాలపై మూడు నెలల్లోగా దర్యాప్తు చేసి, నివేదిక ఇవ్వాలని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఆయన ఆదేశించారు.
వైరస్ జంతువుల నుంచి ఉద్భవించిందా?.ల్యాబ్లో జరిగిన ప్రమాదం నుంచి వచ్చిందా? అనే విషయంపై 90 రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు.అలాగే దర్యాప్తుకు సహకరించాలని అమెరికా నేషనల్ ల్యాబోరేటరీస్ను బైడెన్ కోరారు.వైరస్ గుట్టు విప్పేందుకు చైనా సైతం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.పూర్తి పారదర్శక, సాక్ష్య-ఆధారిత, సంబంధిత డేటా, సాక్ష్యాలను అందించడానికి అవసరమైతే చైనాపై ఒత్తిడి చేయడానికి అమెరికా తన మిత్రదేశాలతో కలిసి పని చేస్తుందని బైడెన్ గుర్తు చేశారు.అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు చైనా సహకరించకపోతే వాస్తవాలు ఎప్పటికీ తెలియకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
కొవిడ్ మూలాలపై దర్యాప్తును ఇప్పటికీ చైనా అడ్డుకుంటూనే ఉందని బైడెన్ ఆరోపించారు.
మరోవైపు కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్లోనే పుట్టిందనే ఆరోపణలకు బలం చేకురేలా మరో కీలక ఆధారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్యానెల్ ముందు అమెరికా ఉంచింది.కరోనా వ్యాప్తి మొదలుకాక ముందు.నవంబర్ 2019లో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలు తీవ్ర అస్వస్థకు గురయ్యారు.
దీంతో ల్యాబ్ నిర్వాహకులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు.అయితే వారికి జరిగే చికిత్స, ఆ పరిశోధకుల వివరాలను ల్యాబ్ అత్యంత రహస్యంగా వుంచింది.
అంతేకాదు వారు చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి చుట్టూ గట్టి బందోబస్తు పెట్టింది.అమెరికన్ నిఘా సంస్థలు ఇందుకు సంబంధించిన వివరాలతో ఒక నివేదిక తయారు చేసి.
డబ్ల్యూహెచ్వో డెషిషన్ మేకింగ్ బాడీ మీటింగ్కు సమర్పించాయి.ఇప్పుడు ఏకంగా జో బైడెన్ వైరస్ గుట్టుపై విచారణకు ఆదేశించడంతో చైనా చిక్కుల్లో పడినట్లేనని వాదనలు వినిపిస్తున్నాయి.