2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో అప్పుడే 2024 ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి అక్కడి రాజకీయ పార్టీలు.జో బైడెన్ మళ్లీ పోటీచేస్తారా.? ట్రంప్ వ్యూహమేంటీ.? కమలా హారిస్ను డెమొక్రాట్లు బరిలోకి దింపుతారా.? ఇలా సవాలక్ష కథనాలను వండి వర్చింది అమెరికన్ మీడియా.ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రచారానికి తెరదించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.2024లో జరిగే ఎన్నికల్లో తాను మళ్లీ పోటీచేస్తాననీ, తనతోపాటు కమలా హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉంటారని బైడెన్ స్పష్టం చేశారు.బుధవారంతో అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా వైట్హౌస్లో జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం 79వ పడిలో ఉన్న బైడెన్కు 2024 నాటికి 81 ఏళ్లు వస్తాయి.ఇప్పటికే ఆయన అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసు అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు.మరి 81 ఏళ్ళ వయసులో దేశాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించగల సత్తా ఆయనకు వుంటుందా వుండదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఇప్పటికే వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బైడెన్ బాధపడుతున్నారు.
ఇక కమలాహారిస్ విషయానికి వస్తే.వైస్ ప్రెసిడెంట్గా ఆమెకు సరైన స్వేచ్ఛ లభించడం లేదనీ, అసలు ప్రభుత్వంలో కమలకు ప్రాధాన్యత లభించడం లేదని ఆరోపణలు వస్తున్న సమయంలో బైడెన్ వ్యాఖ్యలు అమెరికాలో పెద్ద చర్చకు దారితీశాయి.
ప్రస్తుతం కమలా హారిస్ రాజకీయంగా గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు.అయితే జో బైడెన్తో 2024 ఎన్నికల గురించి కానీ రెండోసారి అధ్యక్ష బరిలో నిలుస్తారా అన్న దానిపై చర్చించలేదని కొద్దిరోజుల క్రితం కమలా హారిస్ మీడియాతో అన్నారు.
బైడెన్ మళ్లీ ఎన్నికల బరిలో నిలబడకూడదని నిర్ణయించుకుంటే .ఆమె మళ్లీ వైట్హౌస్ పోటీలో వుండరని విశ్లేషకులు అంటున్నారు.అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి నల్లజాతి వ్యక్తి, తొలి దక్షిణాసియా వాసిగా కమలా హారీస్ చరిత్ర సృష్టించారు.ఆ సమయంలో ఆమె క్రేజ్ ఆకాశాన్ని తాకింది.
కానీ కమలా హారిస్ సిబ్బంది సమన్వయ లోపం, ఆశించిన స్థాయిలో పరిపాలన లేకపోవడంతో పాటు దేశ దక్షిణ సరిహద్దులో వలస సంక్షోభం వంటి అంశాల్లో ఆమె వైఖరిపై ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోస్తున్నాయి.