అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే కోవిడ్పై యుద్ధం చేస్తున్నారు.ఇప్పటికే కరోనాను ఎదుర్కొనేందుకు నిపుణులతో కూడిన కార్యదళాన్ని ఏర్పాటు చేసిన బైడెన్ వ్యాక్సినేషన్కు పెద్ద పీట వేశారు.100 రోజుల ప్రత్యేక కార్యచరణ పెట్టుకున్న ఆయన తన తొలి లక్ష్యం కోవిడ్ విముక్త అమెరికాయేనని తేల్చి చెప్పారు.ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు గాను అవగాహన కల్పిస్తున్నారు.
దేశ స్వాతంత్య్ర దినోత్సవమైన జూలై 4 నాటికి ప్రతి అమెరికా పౌరుడు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఒకవేళ దేశమంతా వ్యాక్సిన్ తీసుకుంటే.
జూలై నాలుగవ తేదీన కోవిడ్ నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చినట్లే అని బైడెన్ స్పష్టం చేశారు.అమెరికాను కరోనా మహమ్మారి విపత్తు నుండి తరిమికొట్టడంతో పాటు, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా భారీ ఆర్థిక ప్రణాళికను ప్రతిపాదించారు.కొవిడ్ నియంత్రణ, ఆర్థికవ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజిని కాంగ్రెస్లో ఆమోదింపజేసుకుని దాని ఫలాలను ప్రజలకు అందజేస్తున్నారు.
అధికారుల కృషి, ప్రజల సహయ సహకారాలతో అమెరికాలో 200 మిలియన్ల టీకాల పంపిణీ కార్యక్రమం గడువుకు ముందే పూర్తవ్వడంతో బైడెన్ ఉద్వేగానికి గురయ్యారు.వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇది ఓ మైలురాయిగా ఆయన అభివర్ణించారు.
ఈ విజయంతో పొంగిపోయి అజాగ్రత్త వహిస్తే వైరస్ మళ్లీ దాడి చేస్తుందని అధ్యక్షుడు హెచ్చరించారు.అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో 100 మిలియన్ డోసులు ఇవ్వాలని బైడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
అది అనుకున్నదానికంటే ముందే 75 రోజుల్లో పూర్తవ్వడంతో లక్ష్యాన్ని 200 మిలియన్లకు పెంచారు అమెరికా అధినేత.దేశంలో కేసుల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల సహకారంతో 200 మిలియన్ల లక్ష్యాన్ని గడువుకు వారం రోజుల ముందే పూర్తి చేశారు.
కాగా, కరోనా కేసుల్లో, మరణాల్లో ప్రపంచంలో అమెరికానే మొదటి స్థానంలో ఉంది.ఇప్పటి వరకు అక్కడ 3.26 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి.కోవిడ్ సోకి అగ్రరాజ్యంలో ఇప్పటికే 5,83,330 మంది ప్రాణాలు వదిలారు.వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు గాను ఏప్రిల్ నెల 19 నుంచి అమెరికాలోని వయోజనులందరూ టీకా తీసుకోవడానికి అర్హులని బైడెన్ ప్రకటించారు.18 ఏళ్లు పైబడిన వారందరూ వీలైనంత త్వరగా టీకాలు తీసుకోవాలని ఆయన సూచించారు.అందరికీ టీకా అందేంత వరకూ ప్రజలు తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరని ఆయన సూచించారు.