ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు మూలస్తంభం లాంటి అమెరికాను సైబర్ నేరగాళ్లు తరచుగా తమ దాడికి లక్ష్యంగా ఎంచుకుంటున్నారు.2016లో ఓ రోజున దిగ్గజ టెక్ కంపెనీలు ట్విటర్, అమెజాన్, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్, టంబ్లర్, రెడిట్ వంటి సేవలు నిలిచిపోయాయి.ఏం జరుగుతుందో తెలియక కోట్ల మంది వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.చివరికి నగదు ట్రాన్స్ఫర్ కోసం వినియోగించే పేపాల్ పనిచేయకపోవడంతో అయోమయం నెలకొంది.ఇంటర్నెట్కు అనుసంధానమైన వెబ్కామ్లు, రూటర్లు, సెట్టాప్ బాక్సులు, డీవీఆర్ల సాయంతో హ్యాకర్లు సైబర్ దాడి చేసినట్లు నిపుణులు గుర్తించారు.ఈ ఒక్క ఘటనలో వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.
ఆ తర్వాత 2020 మార్చి-జూన్ మధ్యలో హ్యాకర్లు సోలార్ విండ్ అనే నెట్వర్కింగ్ సేవల సంస్థకు చెందిన ‘ఓరియన్’ సాఫ్ట్వేర్లోకి ‘సన్బరస్ట్’ అనే హానికారక మాల్వేర్ చొప్పించడంతో అవి వారి ఆధీనంలోకి వెళ్లాయి.అలాగే రెండు నెలల క్రితం అమెరికాలోని అతిపెద్ద చమురు పైప్లైన్ తూర్పు తీరంలోని కలోనియల్ పైప్లైన్ పై హ్యాకర్లు దాడి చేసి ఈ మార్గాన్ని మూసివేశారు.
టెక్సాస్ నుంచి న్యూజెర్సీ వరకు సుమారు 5,500 కిలోమీటర్ల మేర ఇది చమురు సరఫరా చేస్తూ దేశ ప్రజల అవసరాలు తీరుస్తోంది.అధికారిక గణాంకాల ప్రకారం ప్రతినిత్యం 25 లక్షల బ్యారళ్ల పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాన్ని సరఫరా చేస్తుంది.
సైబర్ దాడి వల్ల 18 రాష్ట్రాలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోన్నాయి.
తాజాగా అమెరికాపై మరోసారి అతిపెద్ద సైబర్దాడి జరిగింది.దీనివల్ల స్వీడిష్ కోప్ గ్రోసరి స్టోర్ ప్రపంచవ్యాప్తంగా తన 800 ఔట్లెట్స్ను మూసివేయాల్సి వచ్చింది.ఫ్లోరిడాలోని మియామి కేంద్రంగా పనిచేస్తున్న టెక్ ప్రొవైడర్ కెసెయాను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు.
‘‘రెవిల్ ’’ అని పిలవబడే ర్యాన్సమ్వేర్ను కెసెయా డెస్క్టాప్ మేనేజ్మెంట్ టూల్ వీఎస్ఏను హైజాక్ చేసింది.అనంతరం ఇది వేలాది కంపెనీలకు సేవలందిస్తున్న కెసెయా టెక్ మేనేజ్మెంట్ ప్రొవైడర్లకు వ్యాపించింది.
ఈ భారీ సైబర్ దాడి కారణంగా సుమారు 1000 వ్యాపారాలపై ప్రభావం పడిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ హంట్రెస్ ల్యాబ్స్ వెల్లడించింది.ఈ ఘటనకు సంబంధించి కెసెయా సంస్థ.ఎఫ్బీఐతో కలిసి పనిచేస్తోందని తెలిపింది.రష్యాతో సంబంధాలున్న ఆర్ఈవిల్ రేన్సమ్వేర్ గ్యాంగ్ ఈ సైబర్ దాడి వెనుక ఉన్నట్లు తాము భావిస్తున్నామని హంట్రెస్ ల్యాబ్స్ చెప్పింది.ఆర్ ఈవిల్ అనే రేన్సమ్వేర్ గ్యాంగ్ ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న సైబర్ గ్యాంగుల్లో ఒకటి.అమెరికాలో మే నెలలో మాంసం డెలివరీ చేసే సంస్థ జేబీఎస్ గ్రూపు నెట్వర్క్పై సైబర్ దాడి వెనుకా ఆర్ఈవిల్ ఉందని ఎఫ్బీఐ ఆరోపిస్తోంది.
సైబర్ దాడుల్లో తాము దొంగిలించిన డాక్యుమెంట్లను తమ వెబ్ సైట్ ‘హ్యాపీ బ్లాగ్‘లో పెడతామని ఈ ఆర్ఈవిల్ బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది.
కాగా ఈ సైబర్ దాడిపై చర్యలకు ఉపక్రమించామని అమెరికా సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తెలిపింది.కార్పొరేట్ సర్వర్లు, డెస్క్ టాప్ కంప్యూటర్లు, నెట్వర్క్ డివైస్లలో ఉపయోగించే తమ అప్లికేషన్ ద్వారా ఈ దాడి జరిగి ఉండొచ్చని కెసెయా చెబుతోంది.తమ వీఎస్ఏ టూల్ ఉపయోగించి వెంటనే కస్టమర్లంతా సర్వర్లు షట్డౌన్ చేసుకోవాలని కోరింది.
కెసెయా సంస్థకు 10 దేశాలలో 10,000 మందికి పైగా క్లయింట్లు ఉన్నారు.
మరోవైపు ఈ భారీ సైబర్ దాడిపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
దీని వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేయాల్సిందిగా యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఆదేశించారు.ఈ దాడి వల్ల రైల్వే సేవలు, ఫార్మసీ చైన్ సేవలకు కూడా అంతరాయం కలిగినట్లుగా తెలుస్తోంది
.