అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దాదాపు ఏడు నెలల తర్వాత జోబైడెన్.భారత్ కు సంబంధించి అతి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ హయాం కంటే భిన్నంగా తన పాలనలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉండాలని భావిస్తోన్న బైడెన్.భారత్కు కొత్త రాయబారిని నియమించారు.
ఇండియాలో అమెరికా రాయబారిగా లాస్ ఏంజిల్స్ నగర మేయర్ ఎరిక్ గార్సెట్టి పేరును జోబైడెన్ నామినేట్ చేశారు.గార్సెట్టి పేరు తొలి నుంచీ రేసులో ప్రముఖంగా వినిపించింది.
చివరికి ఆయననే బైడెన్ ఖరారు చేశారు.ఈ మేరకు వైట్ హౌస్ శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది.
ట్రంప్ హయాంలో భారత్లో అమెరికా రాయబారిగా పనిచేసిన కెన్నత్ జస్టర్ స్థానంలో గార్సెట్టి బాధ్యతలు చేపడతారు.ఎరిక్.2013 నుంచి లాస్ ఏంజెల్స్ మేయర్గా, 12 ఏండ్లపాటు సిటీ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు.భారత్తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా బైడెన్ తనకు అత్యంత నమ్మకస్తుడైన ఎరిక్ను రాయబారిగా నామినేట్ చేశారని శ్వేతసౌథం తెలిపింది.
అమెరికా అధ్యక్షుడికి కుడిభుజంగా అభివర్ణించే ఎరిక్ను భారత్కు పంపడం వెనుక పెద్ద వ్యూహమే వుందంటున్నారు విశ్లేషకులు.డెమొక్రటిక్ పార్టీలో కీలక నేతగా వున్న ఎరిక్ గార్సెట్టి.గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు.
అమెరికా అధ్యక్షుడిగా జో పగ్గాలను అందుకున్న తరువాత తొలిసారిగా రాయబారి మార్పు చోటు చేసుకోబోతోండటం రెండు దేశాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
ముఖ్యంగా ఇండో-పసిఫిక్ రీజియన్లో ప్రస్తుతం చైనా నుంచి భారత్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.అటు సముద్ర జలాల వ్యవహారంలోనూ డ్రాగన్ దూకుడును ప్రదర్శిస్తోంది.ఈ విషయంలో భారత్కు అన్ని విధాలుగా అండగా నిలుస్తామంటూ క్వాడ్ దేశాధినేతల సమావేశంలో ఇదివరకే బైడెన్ సంకేతాలను పంపారు.చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే భారత్లో ఎరిక్ లాంటి వ్యక్తి మకాం వేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతో బైడెన్ ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎరిక్ నియామకానికి సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం వుంది.
ఎరిక్ గార్సెట్టికి డెమొక్రాట్లలో సమర్థుడైన నేతగా పేరుంది.మూడు దశాబ్ధాల తర్వాత వేసవి ఒలింపిక్స్ను అమెరికా గడ్డపైన తిరిగి నిర్వహించేందుకు ఆయన చేసిన ప్రయత్నం విజయవంతమైంది.దేశంలో అత్యంత రద్దీగా వుండే రెండో ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అయిన లాస్ ఏంజిల్స్ మెట్రోకు గార్సెట్టి అధ్యక్షత వహిస్తున్నారు.
దీనిలో కొత్తగా 15 లైన్లను నిర్మిస్తున్నారు.అంతేకాకుండా పారిస్ వాతావరణ ఒప్పందాన్ని అమెరికాలోని 400 మంది మేయర్లు పాటించే విధంగా ఏర్పాటు చేసిన ‘‘ క్లైమేట్ మేయర్’’కు కో ఫౌండర్గా ఎరిక్ వ్యవహరిస్తున్నారు.
యూఎస్ నేవీ రిజర్వ్ కాంపోనెంట్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా 12 ఏళ్లపాటు పనిచేసిన గార్సెట్టి.2017లో లెఫ్టినెంట్గా రిటైర్ అయ్యారు.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు.యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు.
నామినేషన్పై ఎరిక్ గార్సెట్టి హర్షం వ్యక్తంచేశారు.భారత్లో అమెరికా రాయబారిగా నామినేట్ చేయడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని చెప్పారు.
ఇండియాలో విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.కాగా, గార్సెట్టితో పాటు బంగ్లాదేశ్ రాయబారిగా పీటర్ డీ హాస్, చిలీ రాయబారిగా మీహాన్, మొనాకో రాయబారిగా డినైస్ క్యాంప్బెల్ను అధ్యక్షుడు బైడెన్ నామినేట్ చేశారు.