అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ తన టీంలో భారతీయులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ వెళుతున్నారు.భారతీయుల సామర్ధ్యంపై నమ్మకం వుంచిన అమెరికా అధ్యక్షుడు ముఖ్యమైన విభాగాలకు అధిపతులుగా మనవారినే నియమిస్తున్నారు.
తాజాగా ఇండియన్-అమెరికన్ న్యాయవాది, సామాజిక కార్యకర్త కిరణ్ అహుజా (49)ను అత్యంత కీలకమైన ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్కు హెడ్గా నామినేట్ చేశారు.అమెరికాలోని 20 లక్షలకు పైగా ప్రభుత్వోద్యోగులు ఈ విభాగం కింద పనిచేస్తున్నారు.
బైడెన్ నామినేషన్ను సెనేట్ ధ్రువీకరిస్తే ఈ అత్యున్నత పదవిని చేపట్టిన మొట్టమొదటి ఇండియన్-అమెరికన్గా కిరణ్ అహుజా చరిత్ర సృష్టిస్తారు.అయితే ఇప్పటికే బైడెన్ సెలక్షన్ను పలువురు కాంగ్రెస్ సభ్యులు సమర్థిస్తున్నారు.
ఈ పదవికి కిరణ్ అహుజా సరైన వ్యక్తని అభిప్రాయపడుతున్నారు. కిరణ్ అహుజాకు అమెరికాలో హక్కుల కార్యకర్తగా మంచి గుర్తింపు వచ్చింది.
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆమె ప్రజాసేవలో ఉన్నారు.ఒబామా హయాంలో వైట్హౌస్ తలపెట్టిన ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు.
డైరెక్టర్ ఆఫ్ యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్కు 2015 నుంచి 2017 వరకు కిరణ్ అహుజా చీఫ్ ఆఫ్ స్టాఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు.ఆమె ప్రస్తుతం రీజనల్ నెట్వర్క్ ఆఫ్ ఫిలాంథ్రాఫిక్ ఇన్స్టిట్యూషన్స్కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
కిరణ్ అహుజా చిన్నతనంలోనే ఆమె కుటుంబం భారత్ నుంచి అమెరికాలోని జార్జియాకు వచ్చి స్థిరపడింది.కిరణ్ అహుజా పొలిటికల్ సైన్స్లో బ్యాచ్లర్స్ డిగ్రీ … యూనివర్శిటీ ఆఫ్ జార్జియా నుంచి లా డిగ్రీని అందుకున్నారు.
కాగా, వాతావరణం, విద్యుత్తు రంగాల్లో నిపుణురాలైన బిడీషా భట్టాచార్యను వ్యవసాయశాఖలోని కీలక స్థానంలో నియమిస్తూ బైడెన్ సోమవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.బిడీషా గతంలో సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్లో వాతావరణ, విద్యుత్తు పాలసీ డైరెక్టర్గా పనిచేశారు.అంతకుముందు విలేజ్ క్యాపిటల్ అనే సంస్థలో ఎమర్జింగ్ మార్కెట్స్ వైస్ ప్రెసిడెంట్గా సేవలందించారు.క్యాపిటల్ హిల్లో మిన్నెసొటా సెనేటర్ అల్ ఫ్రాంకెన్కు సీనియర్ ఎనర్జీ అండ్ అగ్రికల్చర్ పాలసీ అడ్వైజర్గా వ్యవహరించారు.
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సౌరశక్తిని వినియోగించేందుకు గాను సింపా నెట్వర్క్స్ అనే స్టార్టప్ కంపెనీతో బిడీషా పనిచేశారు.ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీలో పబ్లిక్ పాలసీపై మాస్టర్స్, సెయింట్ ఆల్ఫ్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్లో బ్యాచ్లర్స్ డిగ్రీని భట్టాచార్య అందుకున్నారు.