భారత సంతతి వ్యోమగామి రాజా చారిని యూఎస్ ఎయిర్ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి ఎంపిక చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. గురువారం ఈ మేరకు వైట్హౌస్ నుంచి ప్రకటన వెలువడింది.
అమెరికా రక్షణ శాఖ వర్గాల ప్రకారం.అన్ని సీనియర్ పౌర, సైనిక నియామకాలు సెనేట్ ద్వారా ధృవీకరించబడాలి.
ఎయిర్ఫోర్స్లో కల్నల్గా వున్న 45 ఏళ్ల రాజా చారి. ప్రస్తుతం నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్లో క్రూ-3 కమాండర్, వ్యోమగామిగా సేవలందిస్తున్నారు.
స్పేస్ ఎక్స్ డ్రాగన్ కాప్సూల్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన ఆయన దాదాపు 175 రోజుల పాటు అక్కడే వున్నారు.రాజాచారితో పాటు స్పేస్లోకి వెళ్లిన వ్యోమగాముల బృందం గతేడాది క్షేమంగా భూమిపైకి చేరుకున్న సంగతి తెలిసిందే.
ఎవరీ రాజాచారి:
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాజా చారి శిక్షణ పొందారు.యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లో శిక్షణ పొందిన ఏకైక భారత సంతతి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం.ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాసుల కోసం నాసా అతన్ని 2017లో ఎంపిక చేసింది.కఠిన శిక్షణను పూర్తి చేసుకున్న రాజాచారి మూన్ మిషన్కు కూడా అర్హత సాధించినట్లు గతంలోనే నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే.
నాసా 2024లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్’కు ఎంపికైన వ్యోమగాముల్లో ఆయన కూడా ఒకరు.
మిల్వాకీలో జన్మించిన రాజాచారి తండ్రి భారతీయుడు కాగా, తల్లి అమెరికన్.ఆయన బాల్యం తల్లి స్వగ్రామం అయోవాలోని సెడార్ ఫాల్స్లోనే గడిచింది.యూఎస్ ఎయిర్ఫోర్స్లో కల్నల్ స్థాయికి చేరిన రాజా చారికి టెస్ట్ పైలట్గా విశేషమైన అనుభవం వుంది.
ఎఫ్ 35, ఎఫ్ 15, ఎఫ్ 16, ఎఫ్ 18లో 2,500 గంటల పాటు విమానయానం చేసిన అనుభవం ఆయన సొంతం.ఇరాక్ యుద్ధంతో పాటు కొరియా ద్వీపకల్పంలోనూ రాజాచారి అమెరికా వాయుసేన తరపున సేవలందించారు.
మసాచుసెట్స్లోని కేంబ్రిడ్జ్లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్ డిగ్రీ పొందారు.అనంతరం మేరీల్యాండ్లోని పటుక్సెంట్ నదిలో యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్, కాన్సాస్లోని ఫోర్ట్ లీవెన్వర్త్లోని యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలోనూ శిక్షణ పూర్తి చేసుకున్నారు.