భారత ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యంత ప్రాధాన్యతిస్తున్నారు.ఇండియాను కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా గుర్తించిన ఆయన.
పలు విషయాల్లో బాసటగా నిలుస్తున్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు అంతర్జాతీయ సమాజం మద్ధతు పలికింది.
ఇలాంటి పరిస్ధితుల్లో అమెరికా భారత్కు అండగా నిలిచింది.వ్యవసాయ రంగంలో భారత్ తీసుకొచ్చిన సంస్కరణలకు బైడెన్ ప్రభుత్వం మద్ధతిచ్చింది.భారత మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచేలా, ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించేలా ఆ దేశ ప్రభుత్వం చేపట్టే చర్యలను అమెరికా స్వాగతిస్తోందని ఆయన స్పష్టం చేశారు.వ్యవసాయ రంగంలో భారత్ తీసుకొస్తున్న సంస్కరణల వల్ల అక్కడి రైతులకు మార్కెట్ పరిధి పెరుగుతుందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది.
కానీ ఎలాంటి విభేదాలనైనా చర్చలతోనే పరిష్కరించుకోవాలని ఇందుకు అమెరికా ప్రోత్సహిస్తుందని వెల్లడించారు.
ఆ తర్వాత క్వాడ్ దేశాల అధినేతల సమావేశం సందర్భంగా జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.
ఆసియా- పసిఫిక్లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్కు అన్ని విధాలా సహకరిస్తామని బైడెన్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో మరో కీలక సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు .ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు.తాజాగా పారిస్ వాతావరణ ఒప్పందంపై ఏప్రిల్లో బైడెన్ వర్చువల్ భేటీ నిర్వహించనున్నారు.
ఆ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీని ఆయన ఆహ్వానించారు.చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యూ, సౌదీ రాజు సల్మాన్ బిన్ అల్ సౌద్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా 40 మంది దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఏమిటీ పారిస్ ఒప్పందం ? పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల అధిక వాడకంతో పాటు పారిశ్రామికీకరణతో భూగోళం వేడెక్కుతోంది.ఫలితంగా కార్బన్డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువుల మోతాదు పెరిగి అకాల వర్షాలు, వరదలు, కరువు వంటి అనేక పరిణామాలు కలుగుతున్నాయి.
దీనిని నివారించేందుకు గాను ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న లక్ష్యంతో 2015లో ఏర్పాటు చేసుకున్న ఒప్పందమే పారిస్ ఒప్పందం.దీనిపై 195 దేశాలు సంతకాలు చేశాయి.
దీనిపై నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేశారు.అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములుగా ఉన్న యునెటైడ్ నేషన్స్ గ్రీన్ క్లైమేట్ ఫండ్కు ఏటా రూ.6.5 లక్షల కోట్లు జమ చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఒబామా అమెరికా తరఫున వంద కోట్ల డాలర్లు అందజేశారు.డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన విషయం తెలిసిందే.అయితే బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మళ్లీ పారిస్ ఒప్పందంలో అమెరికా చేరుతుందని ప్రకటించారు
.