కోడికూతతో నిద్రలేచి, ఇల్లువాకిలి ఊడ్చి పేడనీటితో కళ్లాపిచల్లి ముంగిట్లో ఒద్దికగా ముగ్గులు వేయడం భారతీయ సంస్కృతి.స్పష్టంగా చెప్పాలంటే హైందవ సంప్రదాయం.
సాధారణంగా పల్లెటూళ్లలో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం అలవాటు.పట్టణీకరణ, నగరీకరణ పెరిగాక, అపార్ట్మెంట్ కల్చర్, సిమెంటు గచ్చులు, పాలిష్బండల మోజు పెరిగాక ఇప్పుడు నగరాల్లోనే కాదు, పల్లెటూళ్లలోనూ ముగ్గులు వేయడానికి చారెడు చోటు మిగలడం కూడా గగనమయిపోతోంది.
అయినా సరే, కళ్లాపిచల్లడం కుదరకపోయినా, రంగవల్లులు తీర్దిదిద్డడం రాకపోయినా, కనీసం చాక్పీస్తో అయినా సరే, ఉన్నచోటులోనే వాకిలిముందు ముగ్గేసేమనిపించుకునే అలవాటును ఆడపిల్లలు మరచిపోలేదు. అమెరికా వెళ్లినా సరే దీనిని అనుచరించేవారు ఎందరో. తాజాగా అగ్రరాజ్యానికి నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా మన ముగ్గు టాక్ ఆఫ్ ది యూఎస్ అయ్యింది.ఈనెల 20న నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులు జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో డెమొక్రాట్ల మద్ధతుదారులతో పాటు అమెరికాలో స్థిరపడిన భారత సంతతి ప్రజలు వందలాది ముగ్గులతో వారికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.టైల్స్పై సహజ రంగులతో ముగ్గులేసి వాటిని రాజధాని వాషింగ్టన్కు పంపుతున్నారు.
అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ ముందు వేలాది ముగ్గుల టైల్స్ పరచి జో బైడెన్కి శుభాకాంక్షలు తెలపనున్నారు. అమెరికా ముగ్గుల బృందం 2021 సభ్యురాలిగా వున్న సౌమ్య సోమనాథ్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలై వున్నారు.
శనివారం నాటికే వేలాది ముగ్గులు వేసి వాటిని వర్చువల్గా ప్రదర్శించారు.భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన కాలిఫోర్నియా, బోస్టన్, న్యూజెర్సీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వాషింగ్టన్కు చేరుకుంటున్నాయి.ముగ్గుల ప్రదర్శనకు తొలుత వాషింగ్టన్ పోలీసులు అనుమతి ఇచ్చారు.అయితే ట్రంప్ మద్దతుదారులు దాడులకు కుట్రపన్నినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో రాజధానిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తుండటంతో అనుమతి రద్దు చేశారు.
అయితే బైడెన్ ప్రమాణస్వీకారం తర్వాత తమ కార్యక్రమానికి అనుమతి లభిస్తుందని సౌమ్య ఆశాభావం వ్యక్తం చేశారు.