అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టాలని గట్టిగా నిర్ణయించారు.100 రోజుల ప్రత్యేక కార్యచరణ పెట్టుకున్న ఆయన తన తొలి లక్ష్యం కోవిడ్ విముక్త అమెరికాయేనని తేల్చి చెప్పారు.ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు గాను అవగాహన కల్పిస్తున్న బైడెన్ ఈసారి మరో సరికొత్త లక్ష్యాన్ని ప్రజలకు నిర్దేశించారు.దేశ స్వాతంత్య్ర దినోత్సవమైన జూలై 4 నాటికి ప్రతి అమెరికా పౌరుడు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఒకవేళ దేశమంతా వ్యాక్సిన్ తీసుకుంటే.జూలై నాలుగవ తేదీన కోవిడ్ నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చినట్లే అని బైడెన్ స్పష్టం చేశారు.
కరోనా వైరస్ను మహమ్మారిగా ప్రకటించి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో గురువారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన బైడెన్.మే ఒకటో తేదీ నాటికి ప్రతి రాష్ట్రంలో ఉన్న వృద్ధులు టీకాలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం వయసు, ఆరోగ్యం తదితర అంశాల ఆధారంగా టీకాలు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.
దేశ ప్రజలంతా టీకా తీసుకుంటే.ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకునే సందర్భం వస్తుందని బైడెన్ ఆకాంక్షించారు.అందరం టీకా వేసుకుంటే, జూలై 4వ తేదీన బంధుమిత్రులతో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే అవకాశం ఉందని ఆయన గుర్తుచేశారు.
ఇది కేవలం దేశ స్వాతంత్ర్య దినోత్సవం మాత్రమే కాదన్న ఆయన.వైరస్ నుంచి కూడా అమెరికా స్వాతంత్య్రం పొందినట్లు అని అభివర్ణించారు.ఇదే సమయంలో టీకా పంపిణీలో వేగం పెంచేందుకు గాను.దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను కూడా పెంచనున్నట్లు బైడెన్ వెల్లడించారు.కాగా, 10 కోట్ల మందికి తాను అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లోనే టీకాలు ఇవ్వాలని బైడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.ఆయన ఆ లక్ష్యాన్ని కేవలం 60 రోజుల్లోనే చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, అమెరికన్లను ఆదుకునేందుకు ఉద్దేశించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజ్ బిల్లుపై బైడెన్ సంతకం చేశారు.ఇప్పటికే సెనెట్, కాంగ్రెస్లలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు అధ్యక్షుడి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారింది.ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత శుక్రవారం దీనిపై అధ్యక్షుడు సంతకం చేస్తారని వైట్హౌస్ వర్గాలు తెలిపాయి.అయితే, బైడెన్ ఒక రోజు ముందుగానే గురువారమే బిల్లుపై సంతకం చేయడం విశేషం.
ఈ ఉద్దీపన ప్యాకేజీ ద్వారా సుమారు 400 బిలియన్ డాలర్లు అమెరికన్లకు ఆర్థిక సాయంగా అందనుంది.ఏడాదికి 75వేల డాలర్లు సంపాదిస్తున్న ఒక్కొ అమెరికన్ పౌరుడి ఖాతాలో నేరుగా 1400 డాలర్లు జమ అవుతాయి.
నిరుద్యోగులకు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ప్రతి వారం 300 డాలర్ల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తారు.అంతేగాకుండా దేశవ్యాప్తంగా కొవిడ్-19 టీకా, టెస్టుల కోసం మరో 50 బిలియన్ డాలర్లు కేటాయిస్తారు.