కరోనా వైరస్ కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఆయన నిర్లక్ష్యం, మొండి వైఖరి కారణంగా అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో తనను ఇంతగా అప్రతిష్టపాలు చేసిన చైనాపై ట్రంప్ విమర్శలు చేస్తున్నారు.అయితే ఈ సారి మాత్రం కాస్త డోసు పెంచారు.
ఇన్నాళ్లు కరోనా వ్యాప్తికి కారణం చైనాయే అంటూ మండిపడిన ఆయన ఈసారి తన ప్రత్యర్ధి జో బిడెన్ను అమెరికా అధ్యక్షుడిగా చేసేందుకే చైనా కుట్ర చేస్తుందంటూ ట్వీట్ చేశారు.నిద్రమత్తులో ఉండే జో బిడెన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే అమెరికాను విచ్ఛిన్నం చేసేందుకు మార్గం సుగమం అవుతుంది కాబట్టి ఆయనను గెలిపించేందుకు డ్రాగన్ తనపై దుష్ప్రచారం చేస్తోందని ట్రంప్ విమర్శించారు.
అలాగే ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా గురించి తప్పుడు సమాచారం ఇస్తోందన్నారు.ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక వైరస్ను వ్యాపింపజేసిన చైనా తరపున వారి అధికార ప్రతినిధి బుద్ధిహీనమైన వ్యాఖ్యలు చేస్తారు.వారి వల్ల ప్రపంచం పడుతున్న బాధ, కోవిడ్ సృష్టించిన మారణహోమాన్ని తక్కువ చేసి చూపుతారు.దీనికితోడు అమెరికా, యూరప్ గురించి తప్పుడు ప్రచారం చేయడం అవమానమని, ఇదంతా ఉన్నతస్థాయి వ్యక్తుల ఆదేశాల మేరకే జరుగుతోందని పరోక్షంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్పై విమర్శలు చేశారు.
అమెరికాలో వ్యాపార, వాణిజ్య, ఇతరత్రా ప్రయోజనాల కోసం జో బిడెన్కు చైనా సహాయం చేసే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు.అగ్రరాజ్యాధినేత విమర్శలపై చైనా స్పందించింది.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవసరం తమకు లేదని తేల్చి చెప్పింది.