అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై చేసిన చెత్త వ్యాఖ్యలకు పెద్ద దుమారం రేగుతోంది.అమెరికాలో ఉన్న భారతీయ అమెరికన్స్ ఇప్పటికే ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిన్నా మొన్నటి వరకూ ట్రంప్ కి ఓటు వేయాలని భావించిన ఎన్నారైలు సైతం ట్రంప్ పై వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నారు.ఇదిలాఉంటే తాజాగా బిడెన్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
భారత్ ఎంతో గొప్ప దేశం, అమెరికాతో అత్యంత సన్నిహితంగా ఉండే మిత్ర దేశం అలాంటి భారత్ పై ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ప్రకటించారు.
భారత దేశంతో మేము ఎప్పుడు మైత్రిని కొనసాగిస్తామని, కమలా హారీస్ , నేను ఇద్దరం భారత్ తో చెలిమిని పదిలంగా కాపాడుకుంటామని తెలిపారు.
అంతేకాదు భారత విదేశాంగ విధానానికి గౌరవం ఇస్తామని అన్నారు.ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ తో సంభంధాలు ఎంతో గొప్పగా ఉండేవని, అప్పట్లో తాను ఉపాధ్యక్షుడిగా ఉన్నానని, ఇప్పుడు భారత సంతతికి చెందిన కమలా హరీస్ ఉపాధ్యక్షురాలిగా బరిలో ఉందని, అధికారంలోకి వచ్చాకా ఇద్దరం ఒబామా హయాంలో విధానాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
అమెరికా, భారత్ ఇరు దేశాలకు మంచి స్నేహ భంధం ఉందని, ట్రంప్ వ్యాఖ్యల కారణంగా అది ప్రమాదంలో పడే అవకాశం ఉందని, ట్రంప్ లాంటి మూర్ఖుడికి భారత్ విలువ తెలియదంటూ బిడెన్ భారత్ పై ప్రేమను కురిపించారు.అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బిడెన్ భారత్ పై దొంగ ప్రేమ చూపుతున్నారని, చైనా భారత్ పై చేస్తున్న దురాగతాలను బహిరంగంగా విమర్శించే ధైర్యం లేదని, భారత్ కు చైనా, పాకిస్తాన్ విషయంలో బహిరంగంగా మద్దతు తెలిపలేని బిడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎన్నికల స్టంట్ అంటూ విమర్శిస్తున్నారు ట్రంప్ మద్దతు దారులు.