అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారతీయులకు ప్రాధాన్యతను ఇస్తున్నారు.ఇప్పటికే తన కొలువులో పలువురు ఇండో అమెరికన్లకు చోటు కల్పించిన ఆయన దేశంలో వివిధ రంగాల్లో స్థిరపడిన భారతీయులపై ఫోకస్ పెట్టారు.
కోవిడ్ కారణంగా ఆర్ధిక వ్యవస్థలు దెబ్బతినడంతో పాటు అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి.ఈ క్రమంలో అమెరికాలో రెస్టారెంట్ నడుపుతున్న ఇద్దరు భారతీయ వ్యాపారులతో బైడెన్ వర్చువల్ మీట్ నిర్వహించారు.
అట్లాంటా, జార్జియాలలో నాన్స్టాప్ పేరిట రెస్టారెంట్ నడుపుతున్న నీల్, సమీర్ ఇద్నానీలతో బైడెన్ నిర్వహించిన సంభాషణకు సంబంధించిన వీడియోను వైట్హౌస్ విడుదల చేసింది.
మీరు ఎలా వున్నారంటూ బైడెన్ వారిని ప్రశ్నించారు.
గతేడాది కరోనా కారణంగా తమ వ్యాపారం దెబ్బతిందని.నాటి నుంచి 75 శాతం మేర బిజినెస్ పడిపోయిందని నీల్ చెప్పారు.
గతంలో తమ రెస్టారెంట్లో 20 నుంచి 25 శాతం మంది ఉద్యోగులు పనిచేసేవారని.అయితే ప్రస్తుతం వారి సంఖ్య 10 నుంచి 15కి పడిపోయిందని నీల్ పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన బైడెన్.మీ రెస్టారెంట్లు మనుగడ సాగించడానికి ఏం కావాలని ప్రశ్నించారు.
దీనికి నీల్ బదులిస్తూ.దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా వేయడం ద్వారా వారు తిరిగి స్వేచ్ఛగా బయటకు వెళ్లవచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బైడెన్ చిన్న వ్యాపారుల కోసం తన రెస్క్యూ ప్రణాళిక గురించి వివరించారు.తాను దేశంలోని చిన్న వ్యాపారులకు పది లక్షల డాలర్ల నిధులను అందించేందుకు ఓ ఉద్దీపన ప్యాకేజీని సిద్ధంగా వుంచానని చెప్పారు.
ఆర్ధిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం మనం వీలైనంత ఎక్కువ పెట్టుబడి పెట్టాలని బైడెన్ అభిప్రాయపడ్డారు.
కాగా, ఈ వీడియోను ఫేస్బుక్లో 1.8 లక్షల మందికి పైగా వీక్షించారు.ఇదే సమయంలో అమెరికన్ రెస్క్యూ ప్లాన్ గురించి సోషల్ మీడియాలో మంచి చర్చ ప్రారంభమైంది.
కాగా, అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా ఆర్థిక పునరుత్తేజానికి బైడెన్ భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే.కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో పాటు , మందగించిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టడమే లక్ష్యంగా ఈ భారీ ప్యాకేజీని ఆయన ఆవిష్కరించారు.ఈ మేరకు 1.9 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.138.88 లక్షల కోట్లు) ప్యాకేజీకి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై జో బైడెన్ సంతకం చేశారు.
‘ద అమెరికన్ రెస్క్యూ ప్లాన్’ పేరుతో ప్రకటించిన ఈ భారీ ప్యాకేజీ ద్వారా కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తామని ఆయన చెప్పారు.ఈ నిధులతో కరోనా పరీక్షల నిర్వహణ, టీకా కార్యక్రమాలతో పాటు.
పౌరులకు నేరుగా ఆర్థిక సాయం, చిరు వ్యాపారులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపడతామని బైడెన్ తెలిపారు.కాగా, కరోనా సృష్టించిన సంక్షోభంతో 1.8 కోట్ల మంది అమెరికన్లు ఇంకా నిరుద్యోగ బీమాపైనే ఆధారపడుతున్నారు.అంతేకాకుండా దాదాపు 4 లక్షలకు పైగా చిన్న వ్యాపార సంస్థలు శాశ్వతంగా మూతపడ్డాయి
.