అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పాలనలో తన మార్క్ కనిపించేలా ప్రయత్నిస్తున్న జో బైడెన్… అదే ఊపులో ముందుకు వెళ్తున్నారు.కరోనాపై యుద్ధం ప్రకటించిన ఆయన నిర్థారణా పరీక్షలు, వ్యాక్సినేషన్, వైద్య రంగానికి కావాల్సిన ఇతర మౌలిక వసతులను అందించేందుకు భారీ ప్యాకేజీని ప్రకటించారు.అలాగే ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గాను 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజ్ను తీసుకొచ్చారు.ఇక ఇమ్మిగ్రేషన్ విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసి లక్షలాది మంది వలసదారులకు ఊరట కలిగించారు.ఇక తాజాగా అమెరికాలో పెచ్చుమీరుతున్న కాల్పుల సంస్కృతిపై బైడెన్ ఫోకస్ పెట్టారు.
ముఖ్యంగా, పాఠశాలల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు.ఈ ఘటనల్లో అమాయకులైన చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
దీనిపై స్పందించిన బైడెన్ అమెరికాలో ప్రాణాంతక ఆయుధాల లైసెన్స్ చట్టాలను మరింత కఠినతరం చేయాలని కాంగ్రెస్కు సూచించారు.మూడేళ్ల క్రితం పార్క్ల్యాండ్ ఊచకోతను స్మరించుకుంటూ.ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ ఘటన అనంతరం చాలా మంది తల్లిదండ్రులు, టీనేజర్లు ఆయుధ చట్టాలను సంస్కరించడానికి న్యాయవాదులుగా మారారని బైడెన్ గుర్తుచేశారు.
తుపాకీల అమ్మకాలకు సంబంధించి అధిక క్యాలిబర్ ఆయుధాల లైసెన్సులను మంజూరు చేయడాన్ని నిషేధించాలని అధ్యక్షుడు కాంగ్రెస్కు సూచించారు.అలాగే తుపాకీ తయారీదారులకు చట్టపరమైన ఇమ్యూనిటీని ఇవ్వడాన్ని కూడా నిషేధించాలని కోరారు.
2018 లో ఫ్లోరిడా ప్రావిన్స్లోని పార్క్ల్యాండ్లోని మార్జోరీ స్టోన్మన్ డగ్లస్ హైస్కూల్లో ఒక దుండగుడు రివాల్వర్తో కాల్పులకు తెగబడ్డాడు.ఈ కాల్పుల్లో 14 మంది పిల్లలతో పాటు మొత్తం 17 మంది చనిపోయారు.దీంతో ఆయుధాల విచ్చల విడి అమ్మకాలను అరికట్టాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.దీంతో ప్రభుత్వం ఎడ్యుకేషన్ సెక్రెటరీ బెట్సీ దేవోస్ ఆధ్వర్యంలో ఫెడరల్ కమిషన్ ఆన్ సేఫ్టీ ప్యానెల్ను ఏర్పాటు చేసింది.
ఈ ప్యానెల్ అన్ని కోణాల్లో పరిశీలించడంతో పాటు నిపుణుల సూచనలతో 180 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ కోసం తుపాకులు ఇవ్వాలని సిఫారసు చేసింది.
కాల్పులు జరిగిన సమయంలో చాకచక్యంగా, వేగంగా ఎదుర్కొనేందుకు టీచర్లకు, సిబ్బందికి ఆయుధాల వాడకంలో శిక్షణ ఇవ్వాలని సూచించింది.