అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బైడెన్ తొలి ప్రకటన ఏంటీ అంటూ అగ్రరాజ్యంలో పెద్ద చర్చ నడుస్తోంది.తాను శ్వేతసౌధంలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెడతానని, కరోనా వైరస్ను నియంత్రిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
అందుకు తగ్గట్టుగానే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కోవిడ్ టాస్క్ఫోర్స్ పేరిట నిపుణులతో ఓ కార్యదళాన్ని ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే కరోనా వల్ల చితికిపోయిన పౌరులను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజ్కు సంబంధించి ఆయన తొలి ప్రకటన ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
కోవిడ్ వల్ల లక్షలాది మంది అమెరికన్లు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు.దీంతో దేశ ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది.ఈ నేపథ్యంలో ఎకానమీని గాడిలో పెట్టేందుకు, ప్రజలను ఆదుకునేందుకు ట్రంప్ ఓ భారీ ప్యాకేజ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.దీని కింద బాధితులకు 600 డాలర్ల ఆర్ధిక సహాయం లభిస్తోంది.
అయితే ఈ సాయం ప్రజలకు ఏ మాత్రం సరిపోదని, ఆహారం, అద్దె చెల్లించడానికి చాలదని బైడెన్ అభిప్రాయపడ్డారు.ఎగువ, దిగువ సభల్లో తమ పార్టీకి మెజారిటీ వస్తే ఈ ఆర్ధిక సాయాన్ని 2000 డాలర్లకు పెంచుతామని ప్రకటించారు.ఈ క్రమంలో జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్థిక సహాయాన్ని పెంచుతూ బైడెన్ ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.కాగా.సోమవారం మీడియా సాక్షిగా బైడెన్.కొవిడ్ టీకా రెండో డోసును తీసుకుంటారని ఆయన కార్యాలయం వెల్లడించింది.
ఫైజర్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ను తీసుకునేందుకు వెనుకాడుతున్న అమెరికన్ల భయాలను తొలగించేందుకు గతేడాది డిసెంబర్ 21న బైడెన్ మీడియా ఎదుట క్రిస్టియానా ఆసుపత్రిలో వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే.